ArticlesNews

దేశ విచ్ఛిన్నానికి తమిళ అతివాద సంస్థ ప్రయత్నాలు, డీఎంకే వ్యూహాత్మక మౌనం-1

272views

వేర్పాటువాద శక్తులు, భారత విచ్ఛిన్నకర శక్తులకు ప్రోత్సాహం ఇచ్చేలా తమిళ అతివాద సంస్థ ‘తమిళ దేశీయ పెరియాక్కం’ ఒక సమావేశం ఏర్పాటు చేసింది. మే 10న తంజావూరులో ‘మేక్ ఇండియా ఫుల్ ఫెడరేషన్’ అనే పేరుతో ఆ సమావేశం నిర్వహించింది. ఆ కార్యక్రమంలో 23 అత్యంత వివాదాస్పద తీర్మానాలను ఆమోదించారు. ఆ అన్ని తీర్మానాల ఉద్దేశం ప్రధానంగా ఒకటే… దేశ సమైక్యతను దెబ్బతీయడం, విభజనవాద అజెండాలను ప్రోత్సహించడం.

ఆ సమావేశంలో పాల్గొన్న సంస్థలన్నీ దాదాపు వామపక్ష భావజాలం కలిగిన, తమిళం కేంద్రంగా వ్యవహరించే విడుదలై చిరుత్తైగళ్ కచ్చి, నామ్ తమిళర్ కచ్చి, మే 17 మూవ్‌మెంట్ వంటి పక్షాలే. తమిళనాడులో అధికారంలో ఉన్న రాజకీయ పక్షం డీఎంకేయే ఆ పక్షాలకు నాయకత్వం వహిస్తున్నది లేదా మద్దతు అందిస్తున్నదీనూ.

ఆ సమావేశంలో చేసిన తీర్మానాలు ఈ విధంగా ఉన్నాయి….

01. ఇండియాని భారత్ అని పిలవకూడదు

02. నాణేల ముద్రణ, కరెన్సీ ముద్రణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్, రవాణా వంటి అంశాలపై అధికారం ఫెడరల్ ప్రభుత్వానికే ఉండాలి

03. ఇండియన్ పార్లమెంటులో అన్ని భాషల వర్గాల నుంచీ సమాన సంఖ్యలో సభ్యులు ఉండాలి

04. గవర్నర్లకు ఎలాంటి పాత్రా ఉండకూడదు. రాష్ట్రాల శాసనసభలను రద్దు చేసే అధికారాలు కలగజేసే రాజ్యాంగంలోని 356వ అధికరణాన్ని తొలగించాలి

05. అన్ని ప్రాంతీయ భాషలకూ అధికార హోదా ఇవ్వాలి, పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇవ్వాలి

06. రాష్ట్రాల హక్కుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోకూడదు. ఉమ్మడి జాబితా ఉండకూడదు

07. తమ సరిహద్దుల లోపల ప్రజలకు పౌరసత్వం ఇచ్చే హక్కు రాష్ట్రాలకు ఉండాలి, పన్నులు వసూలు చేసే అధికారం రాష్ట్రాలకే అప్పగించాలి

08. తంజావూరులో రావ్‌బహదూర్ అబ్రహాం పండిట్‌ కాంస్య విగ్రహం స్థాపించాలి, ఆయనకు స్మారక మండపం నిర్మించాలి

09. తమిళనాడులోని అన్ని దేవాలయాలలోనూ తమిళంలో మాత్రమే పూజలు చేయాలి, తమిళులను మాత్రమే అర్చకులుగా నియమించాలి. (విదేశీ భాషల్లో ప్రార్థనలు చేసే చర్చిలు, మసీదుల సంగతి గురించి నోరెత్తలేదు)

10. కర్ణాటకలాగే తమిళనాడుకు కూడా ప్రత్యేకమైన జెండా ఉండాలి

11. స్వతంత్రమైన ఎన్నికల కమిషన్ ఉండాలి

12. పరిశ్రమలు, వాణిజ్యం, వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోనే ఉండాలి

13. నదులు, చెరువులు, జలాశయాలలోని నీటిని పంచుకునే హక్కులు రాష్ట్రాలకు ఇవ్వాలి

14. అంతర్జాతీయ సముద్ర జలాల్లో సముద్ర సరిహద్దుల్లో కాపలా (పెట్రోలింగ్) నిర్వహణ రాష్ట్రాల చేతికి ఇచ్చేయాలి

15. తమిళనాడులో అధికార భాష, చదువు చెప్పే భాష, ప్రార్థనలు చేసే భాష తమిళం మాత్రమే ఉండాలి

16. రాష్ట్రాలలో కూడా సుప్రీంకోర్టులు, హైకోర్టులూ ఉండాలి

17. బ్రిటిష్ వలస పాలన చిహ్నమైన గవర్నర్ వ్యవస్థను తీసివేయాలి

18. రాష్ట్రాలను వివిధ జాతీయతల మాతృభూములుగా వ్యవహరించాలి

19. అన్ని పోలీస్ అధికారాలూ రాష్ట్రాలకు ఇచ్చేయాలి

20. ప్రెస్, మీడియా మీద అధికారాలన్నీ రాష్ట్రాలకే ఉండాలి

ఈ సమావేశానికి ‘తమిళ దేశీయ పెరియాక్కం’ అధ్యక్షుడు పి మణి అరసన్, ప్రధాన కార్యదర్శి కె వెంకటరామన్ నేతృత్వం వహించారు. నామ్ తమిళర్ కచ్చి అధినేత సీమన్, అరస యోగి కరువూరర్ తమిళీన గురుపీఠం వ్యవస్థాపకుడు సిమ్మహం సత్తియబామ, కో దైవనాయగం, వడ గురుమఠాధిపతి కు,చ్చనూర్ర కిళార్, ఆర్ మన్నారమన్నన్, ఎంఎస్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ తీర్మానాలు వాటి వేర్పాటువాద స్వభావం చేత అవాస్తవికంగానూ, నిర్హేతుకంగానూ కనిపించవచ్చు. కానీ దేశ విచ్ఛిన్నకర శక్తుల ఆలోచనలను బలమైన స్వరంతో వెలిగక్కుతున్నాయి, అలాంటి ప్రతీప శక్తులు తమ భావజాల ధోరణిని (నెరేటివ్) బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అంతేకాదు, క్షేత్రస్థాయిలో ప్రజలు ఇదేవిధంగా భావిస్తున్నారంటూ ప్రచారం చేయడానికి తగినంత మందుగుండును ఈ తీర్మానాలు అందిస్తున్నాయి.