News

‘సెవెన్‌ సిస్టర్స్‌’ గురించి మరోసారి నోరుపారేసుకున్న యూనస్

303views

బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి మహమ్మద్‌ యూనస్ భారత్‌ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారు. మరోసారి ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడి.. భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. బంగ్లాదేశ్‌, నేపాల్, ఈశాన్య రాష్ట్రాలకు సమగ్ర ఆర్థిక సమైక్యతా ప్రణాళిక అవసరమని వ్యాఖ్యలు చేశారు. జలశక్తి, ఆరోగ్య సంరక్షణ, రవాణా, మౌలిక సదుపాయాలు వంటి అంశాల్లో సహకారం ముఖ్యమంటూ మాట్లాడారు. నేపాల్ డిప్యూటీ స్పీకర్‌తో భేటీ సందర్భంగా మన రాష్ట్రాల ప్రస్తావన తెచ్చారు. భారత్‌కు క్రమంగా దూరమవుతున్న బంగ్లా.. పాకిస్థాన్‌, చైనాతో సంబంధాల కోసం ఆరాటపడుతూ ఈ తరహా వైఖరిని ప్రదర్శిస్తుంది.

గత నెల యూనస్‌ చైనాలో పర్యటించిన సందర్భంగా.. బంగ్లాదేశ్‌లో డ్రాగన్ తన కార్యకలాపాలు విస్తరించుకోవచ్చంటూ ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. అక్కడితో ఆగకుండా భారత ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసి నోరుపారేసుకున్నారు. ‘‘భారత ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను సెవెన్‌ సిస్టర్స్ అంటారు. అవి బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితమై ఉన్నాయి. వారు సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదు. ఈ ప్రాంతంలో సముద్రానికి మేమే రక్షకులం. కాబట్టి ఇది భారీ అవకాశం. చైనా ఆర్థిక బేస్‌ను విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది’’ అని వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న ఓ వీడియో వైరల్ అయింది. దానికి భారత్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ కూడా వచ్చింది.

‘‘బంగాళాఖాతం చుట్టూ ఉన్న, దాని సమీపంలోని దేశాలకు ఉమ్మడి ఆసక్తులు, ఆందోళనలు రెండూ ఉన్నాయి. వాటిలో కొన్నింటికి మన చరిత్ర దోహదం చేసింది. ఇతర ప్రాధాన్యాలు ఈ ప్రాంతం శ్రేయస్సును పక్కనపెట్టాయి. బంగాళాఖాతంలో భారత్‌కు 6,500కి.మీ. మేర పొడవైన తీరరేఖ ఉంది. భారతదేశం ఐదు బిమ్స్‌స్టెక్ సభ్య దేశాలతో సరిహద్దును కలిగిఉంది. అలాగే ఆసియన్ దేశాలతో అనుసంధానాన్ని అందిస్తోంది. ముఖ్యంగా మా ఈశాన్య ప్రాంతం బిమ్స్‌స్టెక్ కనెక్టివిటీ హబ్‌గా వృద్ధి చెందుతోంది. రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, గ్రిడ్‌లు, పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌లతో ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం వరకు అనుసంధానం అవుతోంది. ఇది నిజంగా గేమ్ ఛేంజర్‌’’ అని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్ గట్టి బదులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్‌ ప్రదేశ్, అస్సాం, మణిపుర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, త్రిపురను సెవెన్‌ సిస్టర్స్‌గా పిలుస్తారు.