News

‘‘ఖారిజీ మదర్సా’’ దృష్టి పెట్టిన బెంగాల్ సర్కార్

34views

బెంగాల్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు లేని మదర్సాలపై దృష్టి నిలిపింది. ఇందులో భాగంగా ఆ మదర్సాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది. అసలు అవి ఎలా పనిచేస్తున్నాయి? వాటి ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక వనరులు ఎలా వస్తున్నాయి? అన్న వాటిని సమీక్షిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వం నిర్దేశించిన విద్యాపరమైన, పాలనాపరమైన నిబంధనలను అమలు చేస్తున్నాయా? లేదా? అన్న దానిపై కూడా తనిఖీ చేస్తోంది.

మైనారిటీ వ్యవహారాలు, మదర్సా విద్యాశాఖ ఇప్పటికే దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారమే ఈ తనిఖీలన్నీ జరుగుతున్నాయి. అయితే.. ఈ తనిఖీలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. అందుకు గాను ఆయా జిల్లాల్లో ప్రభుత్వ అధికారులకు, మదర్సా విద్యాశాఖకు చెందిన అధికారులకు బాధ్యతలు అప్పగించింది.

రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేకుండా, గుర్తింపు లేకుండా పనిచేస్తున్న మదర్సాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.వాటిలోని మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంక్షేమం, బోధనా పద్ధతులు, సంస్థాగత నిర్వహణపై సమాచారం సేకరించడమే దీని ప్రాథమిక లక్ష్యమని అధికారులు తెలిపారు.

ముఖ్యంగా కూచ్ బెహార్, ఉత్తర దినాజ్‌పూర్, మాల్దా, ముర్షిదాబాద్, బీర్భూమ్, పశ్చిమ మిడ్నాపూర్, తూర్పు మిడ్నాపూర్, నాడియా, హుగ్లీ, హౌరా, ఉత్తర 24 పరగణాలు మరియు దక్షిణ 24 పరగణా జిల్లాల్లో ఎక్కువ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ జిల్లాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థల విషయంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టే బాధ్యతను అధికారులకు అప్పగించారు. ప్రభుత్వ నిధులు లేకుండా నడిచే ‘ఖారిజీ’ మదర్సాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, గుర్తింపు పొందిన మరియు గుర్తింపు లేని సంస్థలన్నింటిపైనా ఈ పరిశీలన ప్రక్రియ కొనసాగుతుంది.

ఖారిజీ మదర్సాలంటే ఏమిటి?
ఖారిజీ మదర్సాలు అనేవి సాధారణంగా ప్రైవేట్ వ్యక్తులు, మత పరమైన సంస్థలు, ట్రస్టులు, స్థానిక సమాజాల ద్వారా స్థాపించబడ్డాయి. వారి ద్వారానే వాటి నిర్వాహణ జరుగుతుంది. అయితే.. ప్రభుత్వ గుర్తింపు పొందిన మదర్సాల మాదిరిగా కాకుండా ఈ సంస్థలు సాధారణంగా ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని మాత్రం పొందవు. అంతేకాకుండా ప్రభుత్వ సూచించిన విద్య విధానాన్ని కూడా అమలు చేయవు.

ప్రభుత్వం విధించిన విధివిధానాలకు అనుగుణంగా ఇవి పనిచేయవు కాబట్టి, వాటి పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల నమోదు, సిబ్బంది వివరాలు, నిధుల మూలాలకు సంబంధించిన అధికారిక సమాచారం పెద్దగా లభించదు. అందుకే ప్రభుత్వం తాజాగా ఈ తనిఖీలు చేపట్టింది. సంస్థాగత నిర్మాణాల గురించి సవివరమైన సమాచారాన్ని సేకరించడం ద్వారా ఈ సమాచార అంతరాన్ని పూడ్చడానికి ప్రయత్నిస్తుంది.

ప్రక్రియలో భాగంగా, అధికారులు ప్రతి సంస్థకు సంబంధించిన వివిధ అంశాలపై సమాచారాన్ని సేకరిస్తారు. ఇందులో మదర్సా ఆవిర్భావం మరియు స్థాపన, నిధుల వనరులు, విద్యార్థుల నమోదు వివరాలు, వసతి సౌకర్యాలు, సిబ్బంది వివరాలు మరియు అందిస్తున్న విద్యా కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఉంటాయి.