News

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం

322views

పాకిస్థాన్ నుంచి అన్ని రకాల దిగుమతులు నిషేధిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. స్వేచ్ఛా వాణిజ్యం ద్వారా చేసుకునే దిగుమతులను కూడా నిషేధించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించే వరకు నిషేధం కొనసాగనుంది. ఏవైనా పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

పాక్ నుంచి పెద్దగా భారత్‌కు దిగుమతులు లేవు. 2019 పుల్వామా ఘటన తరవాత భారత్ పాక్ దిగుమతులను పూర్తిగా తగ్గించింది. కొన్ని రకాలు పండ్లు, నూనెగింజలు, మందులు దిగుమతి అవుతున్నాయి. భారత్ నుంచి పాకిస్థాన్‌కు 447 మిలియన్ డాలర్ల ఎగుమతి జరుగుతుండగా, పాక్ నుంచి భారత్‌కు కేవలం 0.45 మిలియన్ డాలర్ల దిగుమతులు జరుగుతున్నాయి. మొత్తం వాణిజ్యంలో ఇది కేవలం 0.01 శాతం మాత్రమే.

భారత్ నుంచి మందులు, పండ్లు, బంకమట్టి, అరుదైన లోహ మిశ్రమాలు ఎగుమతి అవుతున్నాయి. అవి నిలిపివేస్తే పాక్‌లోని వేలాది పరిశ్రమలు మూతపడనున్నాయి. వాఘా, అటారీ సరిహద్దు నుంచి ఈ ఎగుమతులు జరుగుతున్నాయి. పూర్తిగా ఎగుమతులు నిలిపివేయడంతో పాక్ పరిశ్రమలు విలవిలలాడనున్నాయి.