NewsProgramms

రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండువగా కోజాగిరి ఉత్సవాలు

1.1kviews

కోజాగిరి ఉత్సవాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తుంది. కార్తీక పున్నమి నాడు ఆ పున్నమి వెన్నెల వెలుగులో భారత్ మాతాకీ జై నినాదాలతో స్వయంసేవకులందరూ అలసే దాకా ఆటలాడి, పాటలు పాడి ఆనక ఆ వెన్నెలలో పాలు కాచుకుని,  కార్తీక చంద్రుని కిరణాలు తాకిన ఆ పాలని సేవిస్తారు. ఆ ఆటపాటలలో వారి చదువుల, పదవుల, ఆర్ధిక స్థితిగతుల, కుల, వర్గ అంతరాలేవీ కానరావు. అసలవేవీ వారికి గుర్తు రావు. అసలవేవీ వారిలో లేవు. ఉన్నదొక్కటే మనమంతా తల్లి భారతి సంతానం. మనమంతా అన్నదమ్ములం. అదే సంఘం చేసే వ్యక్తి నిర్మాణం. అదే సంఘం వ్యక్తులలో నింపే సంస్కారం. అదే సామాన్యుణ్ణి సైతం అసామాన్యుడిగా తీర్చిదిద్దే సంఘ తంత్రం.

మన రాష్ట్రంలో కూడా ఇలాగే అన్ని శాఖలలో కోజాగిరి ఉత్సవాలను స్వయంసేవకులు కోలాహలంగా జరుపుకున్నారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన కోజాగిరి సమాచారం అందిన మేరకు:

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో…

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఖండ కేంద్రంలో కోజాగిరి ఉత్సవం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాల కరెస్పాండంట్ శ్రీ వసంత్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త గా విచ్చేసిన ఆంద్రప్రదేశ్ ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ బయ్యా వాసు సమాజ రక్షణకు అందరం సంసిద్దులుగా వుండాలని తెలిపేదే కోజాగిరి ఉత్సవం అని తెలిపారు.

మన దేశానికి, హిందూ సమాజానికి నిత్యం అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని అందరం జాగరూకతతో ఆ సవాళ్ళను ఎదిరించాల్సిన అవసరమున్నదని,  అదే కోజాగిరి ఉత్సవం మనకందించే సందేశమని తెలిపారు.

అనంతరం పిన్నలూ పెద్దలూ కలిసి వెన్నెల వెలుగులో పాలు కాచుకుని తాగారు.

విశాఖలో…

అలాగే విశాఖపట్నంలోని విశాలాక్షి నగర్ భారత విజ్ఞాన కేంద్రంలో మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా కోజాగిరి ఉత్సవం జరిగింది.  ఆర్ఎస్ఎస్ స్థానిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించారు.  ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లాలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగానికి చెందిన ఫ్యాకల్టీ శ్రీ జి.లీలా ప్రసాద్ హాజరై మాట్లాడారు.  అలాగే విశేష వక్తగా నగరంలోని విభాగ్ ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ రాధాకృష్ణ  పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆరిలోవ నగర కార్యవాహ జి.కృష్ణమూర్తి,  నగర శారీరక ప్రముఖ్ బి.సత్యనారాయణ,  శాఖా కార్యవాహ తాండవ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కోజాగిరి ఉత్సవాలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి.