
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులతో కాల్పులు జరిపించిన పాకిస్థాన్కు భారత ప్రభుత్వం సరైన సమయంలో తగిన గుణపాఠం నేర్పుతుందని మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. బంగ్లాదేశ్ను పోగొట్టుకున్నప్పకీ పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే పనిగా పెట్టుకుందని అన్నారు. మరోవైపు, గవర్నర్ల వ్యవహారంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు వేర్వేరుగా ఉన్నాయని, ఉప కులపతులను నియమించుకునే అధికారం కేరళ గవర్నర్కు ఉందని తెలిపిన సుప్రీంకోర్టే.. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్కు ఆ అధికారం లేదంటూ తీర్పు వెలువరించిందని తెలిపారు, ఈ తారతమ్యాలపై న్యాయనిపుణులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఊటీలో గవర్నర్ ఏర్పాటు చేసిన సదస్సుకు వీసీలను వెళ్లకుండా బెదిరించారనే ఆరోపణలపై రాధాకృష్ణన్ స్పందిస్తూ తమిళనాట బెదిరింపులు సర్వసాధారణమని, వీసీలకు మినహాయింపు లేదని వ్యాఖ్యానించారు.





