
యోగా గురువు బాబా రాందేవ్ షర్బత్ జిహాద్ అనే వివాదాన్ని తెర మీదకు తెచ్చారు. కూల్డ్రింక్స్ కంపెనీలు జనాలను మోసం చేసి సంపాదించిన డబ్బులతో మసీదులు, మదర్సాలు కడుతున్నాయని.. మరోవైపు మన ఆరోగ్యాలని దెబ్బ తీస్తున్నాయని ఆరోపించాడు. ఆ వివరాలు..
షర్బత్ జిహాద్ పేరుతో వీడియో రిలీజ్ చేసి సరికొత్త వివాదానికి తెరలేపారు యోగా గురువు రాందేవ్ బాబా. పతంజలి రోజ్ షర్బత్ ప్రమోషన్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. “షర్బత్ జిహాద్ ఇది.. కూల్డ్రింక్స్ పేరుతో కంపెనీలు అమ్ముతున్న మరుగుదొడ్లను శుభ్రం చేసే విషం నుంచి మీ కుటుంబాన్ని, అమాయుకులైన పిల్లలను కాపాడండి. పతంజలి షర్బత్, జ్యూస్లను మాత్రమే ఇంటికి తీసుకెళ్లండి” అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు.
రాందేవ్ పోస్ట్ చేసిన వీడియో సాఫ్ట్ డ్రింక్స్ను విమర్శించే విధంగా ఉంది. వేసవిలో దాహాన్ని తీర్చే పానీయాలంటూ ప్రచారం చేస్తోన్న కూల్డ్రింక్స్ వాస్తవంగా అయితే టాయిలెట్ క్లీనర్లు అంటూ విమర్శించారు. వాటిని విషంతో పోల్చారు. అంతేకాక సదరు కూల్డ్రింక్స్ కంపెనీలు సాఫ్ట్ డ్రింక్స్ పేరుతో మనకు టాయిలెట్ క్లీనర్ని అమ్మడమే కాక.. వాటి మీద వచ్చిన లాభాలతో.. మసీదులు, మదర్సాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఇది కూల్డ్రింక్స్ పేరుతో జరుగుతున్న షర్బత్ జిహాద్ అని ఆరోపించారు.
లవ్, ఓటు జిహాద్ల మాదిరే ఈ షర్బత్ జిహాద్ సమాజాన్ని నాశనం చేస్తుంది అన్నారు రాందేవ్ బాబా. అంతేకాక పతంజలి రోజ్ షర్బత్ తాగితే అది ఆరోగ్యాన్ని పెంచడమేకాక.. గురుకులాలు, ఆశ్రమాలు, పతంజలి యూనివర్శిటీని నిర్మించేందుకు ఆ డబ్బులు వినియోగిస్తామని రాందేవ్ చెప్పుకొచ్చారు. అందుకే షర్బత్ జిహాద్ నుంచి కుటుంబాలను కాపాడాలని సూచించారు.
ఇక్కడ రాందేవ్ బాబా పరోక్ష విమర్శలు చేసింది హమ్దర్ద్ కంపెనీ రూహఫ్జా మీదనే అంటున్నారు నెటిజనులు. రుహఫ్జాని విమర్శిస్తూ.. పతంజలి గులాజీ షర్బత్ని ప్రమోట్ చేస్తున్నారని నెటిజనులు కామంట్స్ చేస్తున్నారు.





