
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ హత్య కేసుపై బాగేశ్వర్ బాబాగా ప్రచారంలో ఉన్న ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రేమించి పెళ్లాడిన భర్త సౌరభ్ రాజ్పుత్ను ప్రియుడు సాహిల్ సాయంతో కట్టుకున్న భార్య ముస్కాన్ దారుణంగా హత్య చేసి,ముక్కలు చేసిన ఘటన సంచలనం సృష్టించింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ప్రియుడితో కలిసి భర్త అడ్డు తొలగించుకుంది. అనంతరం, ప్రియుడి సాయంతో ముస్కాన్ తన భర్త సౌరభ్ రాజ్ మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికి శరీర భాగాన్ని బులుగు రంగు ప్లాస్టిక్ డ్రమ్ములో దాచి పెట్టి పైన సిమెంటుతో కప్పిపెట్టారు.
దారుణం వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితుల్ని కటకటాల్లోకి నెట్టారు. ఈ నేపథ్యంలో సౌరభ్ రాజ్ ఘటనపై ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధీరేంద్ర కృష్ణ శాస్త్రి స్పందించారు. ప్రియుడి సాయంతో భర్తను హతమార్చిన ఘటనను ఉదహరించారు. ‘ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. తల్లిదండ్రులు వారి పిల్లలకు విలువల్ని నేర్పించాలి. ఇందుకోసం శ్రీరామ చరిత్మానస్ బోధనలను పాటించాలని సూచించారు.
‘ప్రస్తుతం మనదేశంలో బ్లూ డ్రమ్ బాగా పాపులరైంది. చాలా మంది భర్తలు షాక్లో ఉన్నారు.మీరట్ ఘటన దురదృష్టకరం. క్షీణిస్తున్న కుటుంబ వ్యవస్థ, పాశ్చాత్య సంస్కృతి, వివాహిత స్త్రీ, పురుషుల వ్యవహారాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. అందుకే ఉన్నతవంతమైన కుటుంబాన్ని నిర్మించేందుకు ప్రతి భారతీయుడు శ్రీరామచరిత్మానస్ను ఆచరించాలని కోరారు.





