ArticlesNews

మహాశివరాత్రికి చివరి పవిత్ర స్నానం.. సన్నాహాలివే..

306views

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ముగింపుదశకు చేరింది. మహాశివరాత్రి(ఫిబ్రవరి 26)తో ఈ మహోత్సవం ముగియనుంది. ఈ నేపధ్యంలో త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. శివరాత్రి రోజున మహాకుంభమేళాలో చివరి పవిత్ర స్నానాలు జరగనుండటంతో అధికారులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.

మహాశివరాత్రి రోజున ఇక్కడికి తరలివస్తున్న భక్తులందరికీ పుణ్యస్నానాలు చేసే అవకాశం కల్పించే దిశగా అధికారులు పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భారీగా భక్తులు తరలివస్తున్న నేపధ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు చేరే అన్నిమార్గాల్లో ట్రాఫిక్‌జామ్‌ నెలకొంటోంది. దీనిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జనం పెద్ద సంఖ్యలో రైళ్లలో ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు.

మహా కుంభమేళా దృష్ట్యా ప్రతిరోజూ 80 నుండి 100 రైళ్లను రైల్వేశాఖ ప్రయాగ్‌రాజ్‌ మీదుగా నడుపుతోంది. ఇప్పుడు మహాశివరాత్రిని దృష్టిలో ఉంచుకుని, ఫిబ్రవరి 26న 200 కి పైగా కుంభమేళా ప్రత్యేక రైళ్లను నడపడానికి రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రత్యేక రైళ్లలో 18 నుండి 20 కోచ్‌లు ఉంటాయి. అయితే, భక్తుల రద్దీ దృష్ట్యా 50 కి పైగా సాధారణ రైళ్లను రద్దు చేశారు. మహా కుంభమేళా సమయంలో భక్తుల కోసం 14 వేలకు పైగా రైళ్లు నడుస్తున్నాయి.

శనివారం (ఫిబ్రవరి 22) వరకు 60 కోట్లకు పైగా భక్తులు మహా కుంభ స్నానం చేశారని డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. మహాశివరాత్రిని దృష్టిలో ఉంచుకుని మహాకుంభమేళా ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారని, సంగమ ప్రాంతానికి వచ్చే భక్తులు సురక్షితంగా స్నానం చేసి, వారి గమ్యస్థానానికి చేరుకునేలా పర్యవేక్షించేందుకు పలువురు అధికారులు ప్రత్యేక విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్లులు ప్రయాగ్‌రాజ్‌కు ఏ మార్గం నుండి వచ్చినా, దానికి సమీపంలోని పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారని వైభవ్ కృష్ణ తెలిపారు.