NewsProgramms

హైందవ శంఖారావం సభలో విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వరశర్మ గారి ప్రసంగం

345views

హైందవ శంఖారావం సభలో విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వరశర్మ గారి ప్రసంగం:

  • ఈ హైందవ శంఖారావానికి అశేష హిందూ జనసమూహం సముద్రంలా తరలివచ్చింది.34 సంవత్సరాల క్రితం 3 కాకపోతే 3వేల దేవాలయాలు వెనక్కి తీసుకుంటాం అని హిందూ సమాజం గర్జించింది.
  • ఇవాళ దేశంలోని అన్ని దేవాలయాలనూ ప్రభుత్వ అధీనంలోనుంచి వెనక్కు తీసుకోడానికి నడుం కట్టింది.
  • శంఖారావం వాస్తవానికి ఇవాళ ప్రారంభం కాలేదు. చల్లా కొండయ్య కమిషన్ గురించి ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు.
  • ఆరోజు మన జియ్యరు స్వామివారు నిరాహార దీక్ష చేసారు. ఆ రోజు నుంచీ ఆంధ్రలో దేవాలయాలను ప్రభుత్వం పెత్తనం నుంచి వెనక్కు తీసుకోవాలన్న ఉద్యమం మొదలైంది, ఆరోజు జియ్యరు స్వామి, పెజావర్ స్వామి ప్రారంభించిన దీక్షను హిందూ సమాజం సరిగ్గా అర్ధం చేసుకోలేదు.
  • తర్వాత తిరుపతిలో మార్పు చేర్పుల మీద చిన్నజీయర్ స్వామి పెద్ద ఉద్యమం ప్రారంభించారు. ఆ ఉద్యమం సఫలం కాలేదనిపించింది. అందరూ కలసి చేద్దామనుకున్నా సాధ్యం కాలేదు.
  • తర్వాత కమలానంద భారతి స్వామీజీ రంగప్రవేశం చేసారు. ఊరూరా జనజాగ్రుతి చేసారు, రథయాత్రతో రాష్ట్రంలో ప్రతీ దేవాలయం గురించి వివరాలు సేకరించారు. ప్రతీ దేవాలయాల ఆస్తుల వివరాలు, వాటిలో అన్యాక్రాంతం అయిన వివరాలు సేకరించారు. దేవాలయాల్లో ఆస్తుల వివరాలతో బోర్టులు పెట్టించింది ఆయనే.
  • అలా ఈ ఉద్యమానికి ఎప్పుడో పునాది పడింది.విహెచ్‌పి ఆవిర్భావ సమయం నుంచే దేవాలయాల విముక్తి గురించి ఉద్యమాల నిర్మాణం ప్రారంభించింది.
  • బ్రిటిష్ ప్రభుత్వం 1959లో తమిళనాడు ఎండోమెంట్స్ చట్టం రూపొందించారు. ఈస్టిండియా కంపెనీ, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టాల ద్వారా ఆలయాల నిధుల దుర్వినియోగం ప్రారంభమైంది.
  • ఆ తర్వాత తమిళనాడు, దాని ఆధారంగా ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖలు ఏర్పడ్డాయి. అప్పట్లోనే సుప్రీంకోర్టు ఎండోమెంట్స్ చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంగా చెప్పాయి.
  • రాజ్యాంగంలోని 25, 26వ అధికరణాలకు వ్యతిరేకంగా ఉన్న ఆ చట్టాలు చెల్లవని సుప్రీంకోర్టు నిర్దేశించింది. అయినా తమిళనాడు చట్టం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లో చట్టం చేసారు.
  • దేవాలయాల్లో అవినీతి ఉందని, దాన్ని రూపుమాపడం కోసమంటూ చల్లా కొండయ్య కమిషన్ ఏర్పాటు చేసారు.
  • ఈ 40 ఏళ్ళలో ఆ కమిషన్ తో దేవాలయాలకు పనికొచ్చేలా ఒక్క పని చేయలేదు. సింహాచలం ఆలయ సమస్యలు, భద్రాచలం ఆలయభూముల అన్యాక్రాంతం… దేన్నీ పరిష్కరించలేదు.
  • శ్రీశైలం గుడికి సంబంధించి 40 అబ్జెక్షన్లలో ఒక్కదాన్నీ పరిష్కరించలేదు. అంటే చల్లా కొండయ్యక కమిషన్ నిజానికి గుడుల మేలు కోసం సాధించింది ఏమీ లేదు. కానీ గుడుల మీద రాజకీయ పెత్తనం మాత్రం సాధించి, వాటిని మరింత లూటీ చేసారు.
  • చల్లా కొండయ్య కమిషన్ దేవాలయ కమిషనర్లకు పూర్తి అధికారాలు ఇచ్చింది. చివరికి మఠాల అధిపతుల నియామకం కూడా కమిషనర్ల చేతిలో అప్పగించారు.
  • ఆ కమిషన్ సిఫారసుల్లోని లొసుగుల వల్లనే అన్యమతస్తులకు గుడుల్లో ఉద్యోగాలు ఇస్తున్నారు.
  • గుడిలో పూజ ఎంతసేపు చేయాలో కమిషనర్ నిర్ధారిస్తున్నారు. ప్రసాదం ఎంత పెట్టాలో వారే నిర్ణయిస్తున్నారు.
  • రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తే ఆ కమిషనర్ వ్యవస్థ దేవాలయాలను పూర్తిగా భ్రష్టు పట్టించింది.
  • దేవాలయాల నిర్వహణ ఎవరు చేస్తారు విహెచ్‌పియా, ఆర్ఎస్ఎస్ ఆ అని అడుగుతున్నారు. కాదు. హిందూ సమాజం నిర్వహిస్తుంది. హిందూ సమాజానికి ఆ శక్తి ఉంది.
  • ధనానికి లోటు లేదు. నిర్వహణా సామర్థ్యానికి లోటు లేదు. హిందువుల్లో అన్ని రకాల శక్తియుక్తులు కలిగినవారు ఉన్నారు.
  • ప్రతీ దేవాలయానికీ తనదైన ఆగమశాస్త్రం, సంప్రదాయం ఉన్నాయి. ఆ పద్ధతుల్లో గుడులను నిర్వహించాలి. ఆ పద్ధతిలో దేవాలయాల నిర్వహణ స్వతంత్రంగా జరగాలి.
  • దేవాలయాలకు ఒకేరకమైన కేంద్రీకృత నిర్వహణా పద్ధతి లేదు. ప్రతీ దేవాలయానికీ స్థానిక ఆచార సంప్రదాయాలు, రీతి రివాజులూ ఉంటాయి.
  • కాబట్టి స్థానిక పెద్దలతో ధార్మిక ట్రస్టుల ఏర్పాటుతో ఆలయాలను నిర్వహించాలి అనే విహెచ్‌పి కోరుకుంటోంది. ఆ మేరకు ఒక ముసాయిదాను తయారుచేసాం.
  • దేవాలయాల వంశపారంపర్య ధర్మకర్తలు, అర్చకులు, అక్కడి భక్తులు కలిసి ఉమ్మడిగా సహకారభావంతో, భక్తితో ఆలయాలు నిర్వహించుకుంటాం. అందులో ప్రభుత్వ జోక్యం ఉండనక్కరలేదు.
  • దానికి అయోధ్య దేవాలయమే ఉదాహరణ. ఒకరోజులో రెండున్నర లక్షల భక్తులకు దర్శనాలు సాఫీగా అయోధ్యలో జరుగుతుంటే అలాంటి వ్యవస్థను మన ఊళ్ళో మన ప్రజలు, మన భక్తులు కలిసి ఎందుకు ఏర్పాటు చేసుకోలేము? చేసుకోగలం.
  • రాజ్యాంగంలో రెలిజియస్ డినామినేషన్ అనే పదానికి అర్ధం తెలియక మన న్యాయమూర్తులు ‘హిందూ రెలిజియస్ డినామినేషన్’ పదానికి అర్ధం ఆక్సఫర్డ్ డిక్షనరీలో వెతికారు.
  • ఇక్కడి స్థానిక సంప్రదాయాల గురించి తెలుసుకోకుండా క్రైస్తవ పద్ధతుల గురించి ఆలోచిస్తే సరైన అర్ధం తెలియదు కదా.
  • మన ఆలయాలను మన సంప్రదాయం ప్రకారం మనమే నిర్వహించుకుందాం. జై శ్రీరాం.