
దేశంలోనే ఎక్కడా లేని తరహాలో పశువులకు గో–ఆధార్ను రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. ఈ మేరకు తిరుపతి జిల్లాను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఈ మేరకు చంద్రగిరి మండలంలోని నారావారిపల్లిలో జరుగుతునన్న నమోదును అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇకపై పశువులకు గో–ఆధార్ గుర్తింపు కార్డులను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన యాప్ను ఇప్పటికే రూపొందించామని, యాప్ పనితీరును పరిశీలిచేందుకు ప్రభుత్వం తిరుపతి జిల్లాను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ రవికుమార్ తెలిపారు.
గో–ఆధార్ మంజూరులో భాగంగా గోవు ముక్కు వద్ద ఉన్న తేమ, ఒక్కో పశువుకు ఒక్కో తరహాలో ఉంటుందన్నారు. మనుషులకు చేతి వేలిముద్రలు ఎలా ఉంటాయో పశువుల ముక్కు వద్ద తేమ అదే తరహాలో విభిన్నంగా ఉంటుందన్నారు. ముక్కు వద్ద ఉన్న తేమను యాప్ ద్వారా స్కాన్ చేసి, పశువుల యజమాని ఆధార్కార్డుకు లింకు చేస్తామని చెప్పారు. తద్వారా పశువుకు గో–ఆధార్ గుర్తింపు కార్డును జారీ చేస్తున్నట్లు తెలిపారు. గో–ఆధార్ పూర్తి చేసిన తర్వాత పసుపు రంగులో ఒక ట్యాగును వాటి చెవికి వేస్తామని చెప్పారు. ఈ గో–ఆధార్ ద్వారా పశువులు తస్కరించినా, స్కానింగ్ ద్వారా గుర్తించవచ్చన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం ద్వారా పాడి పరిశ్రమలకు వచ్చే పథకాలను సులభతరంగా అర్హులకు అందించేందుకు ఈ పథకం దోహద పడుతుందన్నారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద యాప్లో నమోదు చేస్తామని, యాప్ నమోదు విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా గో–ఆధార్ నమోదు ప్రక్రియను చేపడతామని తెలిపారు.





