News

ఎనిమిదో తరగతి అమ్మాయిని పెళ్ళిపేరుతో ఎత్తుకుపోయిన ఫిరోజ్

221views

ఝార్ఖండ్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక హిందూ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి ఫిరోజ్ రాయ్ అనే వ్యక్తి తీసుకువెళ్ళిపోయాడు. ఫిరోజ్‌కు ఇప్పటికే పెళ్ళయి, ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి ఆ బాలికకు తెలియదు. ఆ సంఘటన డిసెంబర్ 19న జరిగింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసారు.

లోహార్‌దాగా జిల్లా భండ్రా బ్లాక్‌లో బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. ఫిరోజ్ రాయ్ అలియాస్ చాంద్ (24) రాంచీలోని చాన్హో బ్లాక్ సోన్స్ గ్రామానికి చెందిన వ్యక్తి. అతనికి పెళ్ళి అయింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న బాలికను చాంద్ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆమెను తీసుకుని పారిపోయాడు.

డిసెంబర్ 19న బాలిక ఒంట్లో బాగోలేదని ఆస్పత్రికి వెళ్ళొస్తాననీ చెప్పి ఇంట్లోనుంచి వెళ్ళిపోయింది. చాలాసేపు గడిచిపోయినా బాలిక రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడి ఆమె కోసం వెతకసాగారు. ఆ క్రమంలో వారికి ఫిరోజ్ రాయ్ గురించి తెలిసింది.

బాలిక తల్లిదండ్రులు భండ్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. వారి అనుమానం మేరకు ఫిరోజ్ రాయ్ ఇంటికి పోలీసులు వెళ్ళి చూడగా అతను కూడా లేడు. దాంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు. ఇది చాలా స్పష్టంగా మైనర్ బాలికను లైంగికంగా దోచుకునే ఉద్దేశంతో ఆమెను లోబరచుకుని ఎత్తుకుపోయిన కేసు అని పోలీసు అధికారి అరవింద్ కుమార్ సింగ్ వెల్లడించారు. నిందితుడు, బాలిక కోసం గాలిస్తున్నారు.

ఈ సంఘటన ఝార్ఖండ్‌లో మహిళలు, బాలికలపై నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్న సంగతికి నిదర్శనంగా నిలిచింది. 2022 నుంచి 2024 లోగా అంటే రెండేళ్ళ వ్యవధిలో ఇటువంటి నేరాలు గణనీయంగా పెరిగిపోయాయి. ప్రత్యేకించి ఈ యేడాది లైంగిక దోపిడీ, ఎత్తుకునిపోవడాలు, హింస వంటి కేసులు బాగా పెరిగాయి. బాధితుల్లో అత్యధికులు హిందూ మహిళలు లేక బాలికలే ఉండడం గమనార్హం.