33
శ్రీ సత్య సాయి జిల్లా పామిడిలో సానిక పెన్నానదిలో వెలసిన సీతారామలక్ష్మణ సమేత భక్తాంజనేయస్వామి ఆలయంలోని ఆంజనేయస్వామి మూలవిరాట్ను దుండగులు అపహరించుకెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్లుగా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఆలయంలో పూజలు చేయడానికి వెళ్లిన సమయంలో అర్చకుడు అమరనాథ్ గుర్తించి విషయాన్ని ఆలయ ధర్మకర్తలు ఎ శ్రీనివాసులు, ఎ షణ్ముఖ కుమార్కు తెలిపారు. ఈ సందర్భంగా షణ్ముఖ కుమార్ మాట్లాడుతూ.. 1938లో తమ పూర్వీకుడు మోటార్ బాలన్న.. పెన్నానదిలో స్నానం ఆచరిస్తున్న సమయంలో లభించిన సీతారామలక్ష్మణ విగ్రహాలను అక్కడే ప్రతిష్టించి ఓ ఆలయాన్ని నిర్మించారని, దీని ఎదురుగానే మరో ఆలయాన్ని నిర్మించి భక్తాంజనేయస్వామి రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారని గుర్తు చేశారు. అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.