News

జగన్ తాడేపల్లి నివాసం వద్ద యువ మోర్చా నిరసన

21views

వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ అయ్యినట్టు నిర్ధారణ కావడంతో స్వామివారి భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసాన్ని బీజేపీ యువ మోర్చా నేతలు ముట్టడించారు.

తిరుమల లడ్డూను అపవిత్రం చేశారంటూ ఆందోళన చేపట్టారు. జగన్ నివాసానికి వెళ్లే గేటు వద్ద బైఠాయించారు. వీరిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు, యువమోర్చా నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. జగన్ క్షమాపణ చెప్పాలని బీజేపీ యువమోర్చా డిమాండ్ చేసింది.హిందూ ద్రోహి జగన్ అంటూ నినాదాలు చేశారు. గతంలో క్యాంప్ ఆఫీస్ ఉన్న వైపు నుంచి లోపలి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.

డౌన్ డౌన్ వైవీ సుబ్బారెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు, వైవీ సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా వేసిన ఫ్లెక్సీలతో నినాదాలు చేశారు. వైసీపీ కార్యాలయం, జగన్ ఇంటి గేటు ముందు దిష్టిబొమ్మను దగ్దం చేశారు. బీజేపీ యువ మోర్చా ఆందోళనకారులను కట్టడి చేయడానికి పోలీసులు అక్కడ రంగంలోకి దిగారు. జగన్ ఇంటి వద్ద ఆందోళన చేస్తున్న ఆందోళన కారులను కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇలా ఉండగా, లడ్డు ఉదంతంపై తన వాదన వినిపిస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 8 పేజీల లేఖను ఆదివారం పంపారు.