ArticlesNews

ఘర్ వాపసీ: ప్రియాంకగా మారిన హీనా ఖాన్

25views

ఉత్తరప్రదేశ్‌లోని రోహిల్‌ఖండ్ ప్రాంతంలో పలువురు ముస్లిం మహిళలు సనాతన ధర్మంలోకి ‘ఘర్‌ వాపసీ’ ద్వారా వెనక్కి వస్తున్నారు. ఇస్లాం మతంలోని ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి పద్ధతులతో అసంతృప్తికి లోనవుతున్న ముస్లిం మహిళలు హిందూధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు. తాజాగా పీలీభిత్‌కు చెందిన హీనా బి ఖాన్ అనే మహిళ స్వచ్ఛందంగా ఇస్లాంను వదిలిపెట్టి హిందూ జీవన విధానాన్ని ఎంచుకుంది.

హీనా ఖాన్, ప్రియాంకగా మారింది. ప్రేమ్‌శంకర్‌ గుప్తా అనే యువకుణ్ణి వైదిక పద్ధతిలో వివాహం చేసుకుంది. వారి పెళ్ళి బరేలీలోని ఒక ఆశ్రమంలో జరిగింది. తను ఇస్లాం మతాన్ని వదిలేసి హిందూధర్మంలోకి రావడం వల్ల తన కుటుంబం నుంచి తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయంటూ ఆమె పోలీసులను రక్షణ కోరింది.

పీలీభిత్ జిల్లాలోని పురాన్‌పూర్ పట్నానికి చెందిన ముంతాజ్‌ ఖాన్ కూతురు హీనా ఖాన్. ఆమె భాగస్వామి ప్రేమ్‌శంకర్ గుప్తా ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉద్ధమ్‌సింగ్‌ నగర్ జిల్లా, సితార్‌గంజ్ ప్రాంతంలోని సిసోనా గ్రామస్తుడు.

హీనాఖాన్ మతం మారాలన్న తన నిర్ణయాన్ని ధ్రువీకరిస్తూ బరేలీ జిల్లా కలెక్టర్‌కు, సీనియర్ ఎస్‌పికి అఫిడవిట్ అందించింది. తను వయోజనురాలినని, సొంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తనకుందనీ ఆమె వెల్లడించింది.

ప్రియాంక తన అఫిడవిట్‌లో మొగలుల చొరబాట్ల సమయంలో వారి భయంతో తన పూర్వీకులు ఇస్లాంలోకి మతం మారారని వెల్లడించింది. ఇప్పుడు ఘర్‌వాపసీ తర్వాత తను సనాతన హిందూ మతానికి చెందినదాన్నని చెబుతోంది. హిందూ దేవీదేవతలను అభిమానంతో కొలుస్తోంది. ఇస్లాంలో మహిళలతో వ్యవహరించే తీరును ఆమె తప్పు పట్టింది. ప్రత్యేకించి ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి పద్ధతులంటే తనకు రోత అని తేల్చిచెప్పింది. తను హిందూమతంలోకి మారాలన్న నిర్ణయం పూర్తిగా తనదేననీ, స్వచ్ఛందంగా తీసుకున్నదేననీ చెప్పింది. తనను ఎవరూ నిర్బంధించి మతం మార్చలేదని స్పష్టం చేసింది.

హీనా ఖాన్ మతం మారడాన్ని ఆమె కుటుంబం సహించలేకపోయింది. ఆమెను బంధువులు నిరంతరాయంగా విమర్శిస్తున్నారు. వాళ్ళవల్లనే ఆమెకు, ఆమె భర్తకూ ఎలాంటి ప్రాణాపాయమూ కలక్కూడదని కోరుకుంటోంది. తమ భద్రత గురించి ఆందోళనల వల్ల తన కుటుంబం తమపై దాడి చేయవచ్చని, తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టవచ్చనీ భయపడుతోంది. తమకు వెంటనే భద్రత ఏర్పాటు చేయాలనీ లేనిపక్షంలో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశముందనీ ప్రియాంకగా మారిన హీనా ఖాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.