News

డల్లాస్ లో సామూహిక గీతా పారాయణం

24views

మైసూరు దత్తపీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం, డల్లాస్‌లో ఉన్న CUTEX ఆడిటోరియంలో భగవద్గీత సామూహిక పారాయణం జరిగింది. అమెరికాలో స్వామివారి 50 ఏళ్ల ఆధ్యాత్మిక సేవలకు గుర్తుగా నిర్వహించిన వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో 18 దేశాల నుంచి వచ్చిన భక్తులు, విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు. భగవద్గీతలోని అన్ని శ్లోకాలనూ అందరూ కలిసి పారాయణం చేశారు. దీంతో వసుధైక కుటుబం అన్న సూక్తి ఇక్కడ కనిపించింది.

ఈ సందర్భంగా గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీ: పూర్వక ప్రసంగం అందించారు. భారత దేశం, అమెరికా బాగుండాలంటూ ఆశీర్వాదాలు ఇచ్చారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు ఆధ్యాత్మిక విలువలు, సాంస్కృతిక సామరస్యం మరియు పరస్పర సద్భావన ద్వారా భారత్ అమెరికా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం వుందన్నారు.అలాగే, స్వామివారు ఒక ప్రత్యేక “విశ్వశాంతి ప్రార్థన”కు నాయకత్వం వహించారు. ఈ భగవద్గీత పారాయణాన్ని ప్రతి కుటుంబం యొక్క శాంతి మరియు సంక్షేమం, సమాజ శ్రేయస్సు, అలాగే సమస్త ప్రపంచ శాంతి మరియు అభివృద్ధికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు వర్ధిల్లడానికి తగిన అవకాశాలు, మద్దతు మరియు అనుకూలమైన వాతావరణాన్ని అందించినందుకు అమెరికా దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. శాంతి, సమృద్ధి, స్వేచ్ఛ మరియు పరస్పర సహకారంతో ప్రపంచం ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని ఆయన పిలుపునిచ్చారు.

భగవద్గీత యొక్క నిత్యనూతన బోధనల ద్వారా శాంతి, నిష్కామ సేవ, దయ మరియు మానవాళి అందరి సంక్షేమం కోసం స్వామివారు ప్రార్థించారు. ప్రతి హృదయంలో, ప్రతి ఇంట శాంతి నెలకొన్నప్పుడే విశ్వశాంతికి మార్గం సుగమమవుతుందని ఆయన అన్నారు.