
లండన్లోని ప్రసిద్ధ బ్రిటిష్ మ్యూజియం (British Museum) లో భద్రపరచబడిన 11వ శతాబ్దానికి చెందిన శ్రీ సరస్వతీ దేవి అత్యంత ప్రాచీన, చారిత్రాత్మక విగ్రహాన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి హర్యానా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని స్వదేశానికి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం నుండి సహకారాన్ని కూడా కోరింది. ఈ నేపథ్యంలో హర్యానా సరస్వతీ హెరిటేజ్ డెవలప్ మెంట్ బోర్డు మధ్యప్రదేశ్ మరియు హర్యానా ప్రభుత్వాల మధ్య పాలనాపరమైన సమన్వయం కూడా చేస్తోంది.
హర్యానా సరస్వతి హెరిటేజ్ డెవలప్మెంట్ బోర్డు డిప్యూటీ ఛైర్మన్ ధుమ్మన్ సింగ్ కిర్మిచ్ దీనిని భారతీయ సంస్కృతి, విశ్వాసం మరియు సరస్వతి నాగరికత యొక్క అమూల్యమైన వారసత్వంగా అభివర్ణించారు.
ఈ విగ్రహం మూలంలో మధ్యప్రదేశ్లోని ధార్ ప్రాంతంలో ఉన్న చారిత్రాత్మక భోజశాల ఆలయానికి (వాగ్దేవి ఆలయం) చెందిందని డిప్యూటీ ఛైర్మన్ ధుమ్మన్ సింగ్ కిర్మిచ్ తెలిపారు. బ్రిటిష్ పాలనా కాలంలో (సుమారు 1886-1891 ప్రాంతంలో) ఆంగ్లేయ అధికారులు దీనిని భారతదేశం నుండి ఇంగ్లాండ్కు తరలించారు.ఇటీవలే మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన ఇండోర్ బెంచ్, భోజశాల ప్రాంగణాన్ని ప్రాచీన సరస్వతి వాగ్దేవి ఆలయంగా గుర్తిస్తూ హిందూ సమాజానికి పూజలు చేసుకునే హక్కును కల్పిస్తూ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ కోర్టు తీర్పు తర్వాత ఈ దివ్య విగ్రహాన్ని తిరిగి భారత్కు తీసుకురావాలనే డిమాండ్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ విగ్రహం పరమార రాజవంశం కాలానికి (11వ శతాబ్దం) చెందినది మరియు దీనిపై సంస్కృతం, దేవనాగరి లిపిలో అరుదైన శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఒకవేళ ఈ విగ్రహం భారత్కు తిరిగి వస్తే, ఈ శాసనాలపై లోతైన పరిశోధనలు జరుపబడతాయి. దీనివల్ల సరస్వతి నది మరియు మన ప్రాచీన నాగరికత గురించిన కొత్త చారిత్రక నిజాలు వెలుగులోకి రానున్నాయి.
ఈ సరస్వతీ విగ్రహం 11 వ శతాబ్దానికి చెందింది. రాజ భోజుని పాలనా కాలం నాటింది. తెల్లని పాలరాయితో దీనిని తయారు చేశారు. దీనిపై ప్రాచీన సంస్కృతం, దేవనాగరి శాసనాలు కూడా వున్నాయి. భారత్ కి తీసుకొచ్చిన తర్వాత హర్యానాలోని సరస్వతీ మ్యూజియంలో దీనిని భద్రపరుస్తారు.ఈ విషయంపై బోర్డు తరఫున మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో అధికారికంగా చర్చలు జరిపినట్లు ధుమ్మన్ సింగ్ కిర్మిచ్ వెల్లడించారు. అంతేకాకుండా, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీకి కూడా లేఖ రాసి పూర్తి కార్యచరణ ప్రణాళికను వివరించినట్లు తెలిపారు.
సంస్కృతి పరిరక్షణ: విగ్రహాన్ని భారత్కు తీసుకువచ్చిన తర్వాత, మొదటగా సరస్వతి నది నాగరికతతో ముడిపడి ఉన్న చారిత్రక ప్రాంతాలలో ప్రజల సందర్శనార్థం ప్రదర్శిస్తారు.
సరస్వతి మ్యూజియంలో స్థాపన: చివరగా ఈ విగ్రహాన్ని హర్యానాలో ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక సరస్వతి మ్యూజియంలో స్థాపించనున్నారు.
పరిశోధనలు: విగ్రహంపై చెక్కిన సంస్కృత, దేవనాగరి శాసనాలను ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) మరియు చరిత్రకారుల ద్వారా అధ్యయనం చేయిస్తారు.
సరస్వతి బోర్డు కథనం ప్రకారం, సరస్వతి నది తీరాలలో వర్ధిల్లిన నాగరికత భారతీయ చరిత్రకు మరియు జ్ఞాన పరంపరకు పునాదిగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో, ఇలాంటి అమూల్యమైన సాంస్కృతిక వారసత్వ సంపదను తిరిగి మన దేశానికి తీసుకురావడం మన జాతీయ మరియు సాంస్కృతిక బాధ్యతగా ప్రభుత్వం భావిస్తోంది.




