News

కోల్‌కతా వైద్యురాలి కేసు.. సామూహిక అత్యాచారం.. ఇదిగో సాక్ష్యం..!

35views

కోల్‌కతా జూనియర్ రెసిడెంట్ డాక్టర్ హత్యాచార ఘటనలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు డాక్టర్ సుభర్ణ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన డాక్టర్ సుభర్ణ గోస్వామి.. బాధితురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందన్నారు. ఒక్కరే లైంగిక దాడి చేస్తే అంత ద్రవ పదార్థం ఆమె శరీరంలో ఉండదని పేర్కొన్నారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని స్పష్టమవుతుందన్న డాక్టర్ సుభర్ణ.. ఈ హత్యాచార ఘటనలో పలువురు ప్రమేయం ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని బాధితురాలి కుటుంబసభ్యులు కూడా స్పష్టం చేశారని గుర్తు చేశారు.

ఆమె ఒంటిపై బలమైన గాయాలు సైతం ఉన్నాయని, ఒక్క వ్యక్తి మాత్రమే అయితే అంతలా గాయం చేసే అవకాశాలు లేవని అన్నారు. మరోవైపు, మృతురాలి కుటుంబసభ్యులు తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగిందని, శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందని కలకత్తా హైకోర్టుకు వివరించారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరారు. పోస్టుమార్టం రిపోర్టులో గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ద్వంద్వంగా పేర్కొన్నారని, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని తమ పిటిషన్‌లో వాపోయారు.

‘పోస్ట్‌మార్టం నివేదికలో భయందోళనకు గురిచేసే వాస్తవాలు వెల్లడయ్యాయి… మా కుమార్తె శరీరంపై అనేక గాయాల గుర్తులు ఉన్నాయి.. ఇది క్రూరమైన, హింసాత్మక దాడిని సూచిస్తుంది.. తలను బలంగా గోడకు లేదా నేలకు తాకించినట్టు సంకేతాలు ఉన్నాయి.. చెవులు, పెదవులుపై గాయాలు.. మెడపై పంటితో కొరికిన గుర్తులు ఉన్నాయి’ అని పేర్కొన్నారు. తమ కుమార్తె సామూహిక అత్యాచారం మరియు హత్యకు గురైనట్లు సాక్ష్యాధారాలు స్పష్టంగా సూచిస్తున్నప్పటికీ, ఇతర నేరస్థులను అరెస్టు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇది ఒక వ్యక్తి మాత్రమే చేయగలిగే నేరం కాదని బాధిత కుటుంబం వాపోయింది. ఇదే సమయంలో పోస్ట్‌మార్టం నివేదిక కూడా సామూహిక అత్యాచారం జరిగినట్టు పలు ఆధారాలు బయటపెట్టింది. దీంతో ఈ నేరంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నారనే అనుమానం బలపడుతోంది.

ఆగస్టు 8న నైట్ డ్యూటీలో ఉన్న వైద్యురాలిపై.. ఆ రోజు తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు.. అతి దారుణంగా ప్రాణాలు తీశాడు. మర్నాడు ఆగస్ట్ 9 తేదీన సెమినార్ హాల్‌లో నగ్నంగా పడి ఉన్న ట్రెయినీ డాక్టర్ మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశించింది. మరోవైపు, ఈ ఘటనకు నిరసనగా బుధవారం అర్ధరాత్రి కోల్‌కతాలో మహిళలు వినూత్న ఆందోళనకు పిలుపునిచ్చారు.