News

పీఓకే విదేశీ భూభాగమే.. అంగీకరించిన పాక్

75views

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) విదేశీ భూభాగమేనని పాక్ ప్రభుత్వం తాజాగా అంగీకరించింది. ఇస్లామాబాద్ హైకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ఈ మేరకు పేర్కొంది. పీఓకేకు చెందిన జర్నలిస్టు అహ్మద్ ఫర్హాద్ షాను రావల్పిండిలోని తన నివాసంలో కొందరు కిడ్నాప్ చేశారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్లే అతడిని అపహరించారన్న వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఫర్హాద్ భార్య హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తను కోర్టు ముందు హాజరపరిచేలా పాక్ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషన్‌పై విచారణ సందర్భంగా పాక్ ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ తన వాదన వినిపించారు. పర్హాద్ ను పీఓకే పోలీసులు అరెస్టు చేశారని, పీఓకే విదేశీ భూభాగమని పేర్కొన్నారు. అక్కడ ప్రత్యేక కోర్టులు, పోలీసు వ్యవస్థ వున్నాయని అన్నారు. ఆ భూభాగం తమ పరిధిలోకి రాదన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ అది విదేశీ భూభాగమైతే పాక్ మిలిటరీ నిత్యం పీఓకేలోకి ఎందుకు చొరబడుతుందని సూటి ప్రశ్న వేశారు. ఐఎస్ఐ జనాలను అపహరించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ధిర్కోట్ పోలీసులు ఫర్హాద్ ను అరెస్టు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉంచితే, పీఓకే ఎప్పటికీ భారత్ భూభాగమేనని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.