News

ముగిసిన సుదీర్ఘ ధ్యానం.. తిరువళ్లువర్‌కు మోదీ నివాళులు

75views

తమిళనాడులోని కన్యాకుమారిలో స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన సుదీర్ఘ ధ్యానం ముగిసింది. గురువారం సాయంత్రం ప్రారంభమైన ధ్యానం.. 45 గంటలపాటు కొనసాగింది. ఈ క్రమంలోనే ఉదయం సూర్యుడికి అర్ఘ్యం వదిలారు.

ధ్యానం ముగిసిన అనంతరం ప్రముఖ తమిళ కవి, తత్వవేత్త తిరువళ్లువర్‌ విగ్రహానికి మోదీ పూలమాల వేసి, నివాళులర్పించారు. వివేకానంద శిలాస్మారకం పక్కనే చిన్న దీవిపై ఏర్పాటుచేసిన 133 అడుగుల ఎత్తయిన ఈ భారీ విగ్రహం వద్దకు ఆయన పడవలో చేరుకున్నారు. అనంతరం కన్యాకుమారి తీరానికి తిరిగివచ్చారు.

సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసిన వెంటనే పంజాబ్‌ నుంచి వెనుదిరిగిన మోదీ.. తమిళనాడులోని భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం శిలాస్మారకాన్ని చేరుకుని, ధ్యాన ప్రక్రియను ప్రారంభించారు. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద కూడా ఇక్కడ ధ్యానం చేశారు.