News

వైభవంగా దారగంగమ్మకు జలాభిషేకం

106views

శృంగవరపుకోట, న్యూస్‌టుడే : ఎస్‌.కోట గ్రామదేవత శ్రీదారగంగమ్మ జాతరలో భాగంగా ఆదివారం ఉదయం జలాభిషేకం వైభవంగా జరిగింది. ఆలయంలో అమ్మవారికి అర్చకులు అగ్నిహోత్రం రాజగోపాలచార్యులు, గార్లపాటి మూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మూలవిరాట్టుకు గంగ, పాలతో అభిషేకాలు నిర్వహించారు. వేలాదిగా మహిళలు కలశాలతో తరలివచ్చి జలాభిషేకం చేశారు. అనువంశిక పూజారి మోపాడ గౌరినాయుడు దంపతులు అమ్మవారిని అభిషేకించారు. అనంతరం మూలవిరాట్టు నిజరూప దర్శనానికి భక్తులను అనుమతించారు.

నేడే తొలేళ్ల ఉత్సవం..
దారగంగమ్మ జాతరలో భాగంగా తొలేళ్లు సోమవారం జరగనుంది. మోపాడ వీధిలోని అమ్మవారి ఆనువంశిక పూజారి గౌరినాయుడు ఇంటి నుంచి చుక్కవీధిలో బసవబోయిన గంగయ్య ఇంటి వద్ద చేనుకుండలో వరి విత్తనాలు పట్టుకొని ఊరేగింపు బయలుదేరుతారు. గాంధీబొమ్మ కూడలిలో ఉన్న పాండవుల చావిడి (శతకం పట్టు) వద్ద విత్తనాలు పోస్తారు. వీటిని రైతులు కొద్దిగా పట్టుకెళ్లి వరిసాగుకు వేసే విత్తనాల్లో కలుపుతారు. మంగళవారం అమ్మవారి అనుపోత్సవం జరగనుంది.