
ఆధ్యాత్మిక ప్రపంచంలో నేడు ఒక పవిత్ర ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాఖండ్లోని అత్యంత పవిత్రమైన శ్రీ కేదార్నాథ్ ధామం తలుపులు బుధవారం భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. మంచు కొండల నడుమ కొలువైన కేదార్నాథ్ ఆలయం ఉదయం 8 గంటలకు వైభవంగా తెరుచుకుంది. వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య సుమారు 51 క్వింటాళ్ల పూలతో అందంగా అలంకరించిన ఈ పుణ్యక్షేత్రం భక్తులకు స్వాగతం పలికింది. స్వామి వారి సందర్శనార్థ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. మరోవైపు, రేపు విష్ణుమూర్తి నివాసమైన బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక సందేశాన్ని ఇచ్చారు. చార్ధామ్ యాత్ర మన దేశ విశ్వాసానికి, ఐక్యతకు మరియు సుసంపన్నమైన సంప్రదాయాలకు దివ్య ఉత్సవం వంటిదని ఆయన పేర్కొన్నారు.ప్రతి ఒక్కరి యాత్ర సుఖమయంగా సాగాలని, బాబా కేదార్ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.





