News

హనుమా.. భక్తుల అవస్థలు కానవా?

117views

అనంతపురం జిల్లా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తులు విడిది చేసే రామదూత నిలయంలో సమస్యలు తిష్ఠ వేశాయి. ఇక్కడ 16 ఏసీ గదులున్నాయి. 8 గదుల్లో ఏసీలు గత కొన్ని నెలలుగా పనిచేయడంలేదు. ఫలితంగా ఇందులో బస చేసే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కిటికీల అద్దాలు పగులడంతో వాటి గుండా కోతులు గదుల్లోకి ప్రవేశించి వస్తువులను పాడు చేస్తున్నాయి. కిటికీలకు మరమ్మతులు చేయించాలని భక్తులు పలుమార్లు ఆలయ అధికారులను విన్నవించినా స్పందన కొరవడింది. వేసవి కాలం కావడంతో భక్తులు ఏసీ గదులనే ఎంపిక చేసుకుంటున్నారు. భగభగమండే ఎండల నేపథ్యంలో ఏసీ గదుల్లో సేద తీరుదామని భక్తులు అధికంగా బాడుగ చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఏసీ పని చేయకపోవడంతో భక్తులు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. తాము బాడుగ చెల్లిస్తున్నా ఏసీలు లేకుంటే తాము గదుల్లో ఏవిధంగా విశ్రాంతి తీసుకోగలమని వారు ప్రశ్నిస్తున్నారు. గదుల ఏసీలు పనిచేయకుంటే అత్యవసర పనుల కింద వాటికి మరమ్మతులు చేయించాల్సి ఉన్నా ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ఇక వసతి గదుల సముదాయానికి సంబంధించి గోడలు రంగులు పాలిపోవడంతో కళావిహీనంగా కనిసిస్తున్నాయి. వెంటనే అధికారులు గదుల విషయంలో అవసరమైన మరమ్మతులతో పాటు గదులకు రంగులు వేయించాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లగా కోతులు విద్యుత్తు తీగలను నాశనం చేస్తున్న కారణంగా ఏసీలు పనిచేయడం లేదన్నారు. మరమ్మతులు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పగిలిన కిటికీల అద్దాల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయిస్తామని వివరించారు.