
కెనడాలోని సిక్కు వేర్పాటువాద గ్రూప్లు లక్ష్మణరేఖ (బిగ్ రెడ్లైన్) దాటుతున్నాయని ఆ దేశంలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని భారత్ జాతి భద్రత, ప్రాదేశిక సమ్రగతలకు ముప్పు కోణంలో చూస్తోందని చెప్పారు. ఈ మేరకు ప్రముఖ మేధోమథన సంస్థ మాంట్రియల్ కౌన్సిల్ ఆన్ ఫారెన్ రిలేషన్స్లో సంజయ్ మాట్లాడారు. భారత్ భవిష్యత్తును భారతీయులే నిర్ణయించుకుంటారని, విదేశీయులు కాదని స్పష్టం చేశారు. కెనడా గడ్డ నుంచి భారత భద్రతకు పొంచి ఉన్న ముప్పు గురించే తన ప్రధాన ఆందోళన అని వ్యాఖ్యానించారు. ‘‘ద్వంద్వ జాతీయతను భారత్ ఎన్నటికీ గుర్తించదు. ఎవరైనా వలస వెళితే వారిని విదేశీయులుగానే పరిగణిస్తాం. భారత ప్రాదేశిక సమగ్రతపై దుష్టశక్తుల కన్ను పడింది. తమ స్వస్థలాన్ని భారత్ నుంచి విడదీయాలని చూస్తున్న కొందరు.. తమ చర్యలతో లక్ష్మణ రేఖ దాటుతున్నారు. దీనిని భారత్ ప్రాదేశిక సమగ్రతకు, దేశ భద్రతకు ముప్పుగానే పరిగణించి నిర్ణయాలు తీసుకుంటుంది జాగ్రత్త..!’’ అని సంజయ్వర్మ హెచ్చరించారు. ‘‘భారత్-కెనడాలు తమ మధ్య నెలకొన్న వివాదాలను సమయం చూసుకుని చర్చలతో పరిష్కరించుకుంటాయి’’ అని తెలిపారు.





