News

శారదా మఠం అధ్యక్షురాలు ఆనందప్రాణ కన్నుమూత

265views

కోల్‌కతా శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మిషన్‌ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మంగళవారమిక్కడ కన్నుమూశారు. 98 ఏళ్ల మాతాజీ వృద్ధాప్య సంబంధిత రుగ్మతలతో బాధపడేవారు. రామకృష్ణ మఠం నిర్వహణలోని రామకృష్ణ సేవా ప్రతిష్ఠాన్‌ ఆసుపత్రిలో చికిత్స పొంది కొద్దిరోజుల క్రితమే డిశ్ఛార్జి అయ్యారని శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మఠం ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇక్కడి శారదా మఠం కేంద్ర కార్యాలయంలో అమెకు చికిత్స జరిగేదని, మంగళవారం ఉదయం 9.45 గంటలకు తుదిశ్వాస విడిచారని వెల్లడించారు. ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్‌ వేదికగా సంతాపం తెలిపారు. సమాజానికి ఆమె అందించిన అద్వితీయ సేవలు, ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంలో ఆమె చేసిన కృషి చిరకాలం గుర్తుంటుందని చెప్పారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సంతాపం ప్రకటించారు.