
ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. నేడు స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో స్వామిని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అయితే ఒక్కసారిగా దేవస్థానం టికెట్ల కౌంటర్ల సర్వర్లు పనిచేయలేదు. సాంకేతిక లోపం కారణంగా టికెట్ కౌంటర్ల సర్వర్లు పనిచేయని పరిస్థితి. దీంతో దేవస్థానం టికెట్ కౌంటర్లు, కేశఖండశాల, ప్రసాదం కౌంటర్లు, టోల్గేట్ల వద్ద భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. సుమారు రెండు గంటలకు పైగా పని చేయకపోవడంతో టికెట్లు లభించక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాక క్యూ లైన్లో ఉన్న భక్తుల మధ్య స్వల్ప తోపులాట కూడా చోటుచేసుకుంది. దీంతో ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే అధికారులు భక్తులకు మ్యాన్యువల్ టికెట్లు ఇచ్చి దర్శనానికి పంపించారు. అనంతరం సర్వర్ పనిచేయడం ప్రారంభించడంతో యధావిధిగా ఆన్లైన్లో టికెట్లు పంపిణీ చేశారు. తరచూ ఇలా సర్వర్లు ఆగిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పలువురు భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.





