
అయోధ్యలోని భవ్య రామమందిర ప్రాంగణంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కాంప్లెక్స్ ఉత్తర-పశ్చిమ (పర్కోటా) దిశలో నూతనంగా నిర్మించిన మాతా భగవతి ఆలయ శిఖరంపై ఘనంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త సాధ్వి రితంబర ఈ పవిత్ర ధ్వజాన్ని ఆవిష్కరించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో దేశం నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది సాధువులు, మహిళా భక్తులు, సామాజిక ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాధ్వి రితంబర మాట్లాడుతూ.. ‘లవ్ జిహాద్’, ‘గోవధ’ వంటి సామాజిక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజం, ముఖ్యంగా యువత ఈ సవాళ్ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.
నేటి ఆధునిక కాలంలో యువతకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, తిలకం ధరించడం వంటి ఆచారాల ప్రాధాన్యతను వివరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సాధ్వి రితంబర పేర్కొన్నారు. రామాలయ ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఆమె ఒక భావోద్వేగ కవితను చదివి వినిపించారు. ఎన్నో తరాల త్యాగాలు, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ భవ్య మందిర నిర్మాణం సాధ్యమైందని, ఇది భారతీయుల ఆత్మగౌరవ ప్రతీక అని కొనియాడారు. సమాజంలో పెరుగుతున్న ‘లవ్ జిహాద్’ ఉచ్చుల పట్ల బాలికలకు అవగాహన కల్పించాలని ఆమె కోరారు. అలాగే, దేశవ్యాప్తంగా గోవధను పూర్తిగా నిషేధించాలని, గోసంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని స్పష్టం చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న ఆరు ఉప-ఆలయాలలో (సూర్య, శివ, గణేశ, హనుమాన్, అన్నపూర్ణ, భగవతి) దశలవారీగా ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే నిర్వహించిన ఈ కార్యక్రమం అయోధ్యకు వచ్చే భక్తులలో సరికొత్త ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది.
ఆర్గనైజర్ సౌజన్యంతో





