News

విశాఖపట్నంలో ‘తూర్పు కనుమలలో గిరిజన సాంస్కృతిక యాత్ర’ ముగింపు సభ

211views

ప్రకృతినే దైవంగా కొలిచే విశిష్ట సంస్కృతి గిరిజనుల సొంతమని వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ జాతీయ కార్యదర్శి పొన్నపల్లి సోమయాజులు అన్నారు. ప్రపంచమంతటా కీర్తిప్రతిష్ఠలు ఆర్జిస్తున్న భారతీయ సంస్కృతి మూలాలు ఆదివాసీ సంస్కృతిలోనే ఉన్నాయని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ సంస్థ నిర్వహించిన తూర్పు కనుమల గిరిజన సాంస్కృతిక యాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అడవులే పుట్టినిల్లు అని సోమయాజులు చెప్పారు. పూర్వం ఋషులు, మునులు అటవీ ప్రాంతాల్లోనే ఆశ్రమవాసం చేసేవారనీ, అక్కణ్ణుంచే భారతీయ సభ్యత, సంస్కృతి, ఆచార వ్యవహారాలూ మొదలై దేశమంతా వ్యాపించాయనీ గుర్తు చేసారు. చెట్లలా కష్టాలను తాము స్వీకరించి, సుఖాలను చుట్టూ ఉన్నవారికి పంచిపెట్టారనీ చెప్పారు.

విదేశీ పాలనకు ముందు భారతదేశంలో గిరిజనులు చెట్లను సంరక్షించారని, బ్రిటిష్ వారి హయాంలోనే అటవీ ఉత్పత్తులతో వ్యాపారం మొదలైందని, దేశవ్యాప్తంగా అడవుల విస్తీర్ణం తరిగిపోయిందనీ ఆయన వివరించారు. ఒక చెట్టును నరకాలంటే దానికి ముందు పూజ చేసి నమస్కరించుకునే అలవాటు ఈనాటికీ గిరిజనుల్లో ఉందన్నారు.

గిరిజన హక్కుల పరిరక్షణ సంస్థ ‘హితరక్ష’ జాతీయ కార్యదర్శి గిరీష్ కుబేర్ మాట్లాడుతూ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వారి భాషను అర్ధం చేసుకోవడం ఎంతైనా అవసరమన్నారు. అప్పుడే అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం, కమ్యూనిటీ హక్కులు వంటివి సమర్థంగా అమలవుతాయని వివరించారు.

విజయనగరం గిరిజన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య మణి మాట్లాడుతూ మంచి విద్యతోనే గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని వివరించారు.

తూర్పు కనుమల గిరిజన సాంస్కృతిక యాత్ర వివరాలను వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు గోపీనాథ్ వివరించారు. జనవరి 26 నుంచి పదకొండు రోజుల పాటు జరిగిన యాత్ర ఒడిషాలోని జేపూర్‌ నుంచి మొదలైందనీ, ఫిబ్రవరి 4న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ముగిసిందనీ వివరించారు. ఈ యాత్రలో భాగంగా 22 ప్రాంతాల్లో సభలు నిర్వహించామన్నారు. గిరిజనుల పట్ల సాధారణ ప్రజల్లో ఉండే అపోహలను పోగొట్టి పరస్పరం సోదరభావం కల్పించడంలో ఈ యాత్ర విజయవంతమైందని వెల్లడించారు.

సాంస్కృతిక యాత్ర ముగింపు సభ విశాఖపట్నంలో నిర్వహించారు. గిరిజన దేవత నేలకొందమ్మ పూజతో కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆ సభలో డా. పిరాట్ల శివరామకృష్ణ రచించిన ‘గిరుల ఆరోగ్యమే పల్లపు ప్రాంతాల సౌభాగ్యం’ పుస్తకాల తెలుగు, ఇంగ్లిష్ ప్రతులను ఏయూ వైస్‌ఛాన్సలర్ ఆచార్య ప్రసాద రెడ్డి, గిరిజన యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ డాక్టర్ కట్టుమణితో కలిసి పుస్తకాలను ఆవిష్కరించారు.