ArticlesNews

అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ!!

367views

( జనవరి 04 – లూయీ బ్రెయిల్ జయంతి )

అంధుల ప్రపంచానికి అపురూపమైన లిపిని అందించడం ద్వారా చిరస్మరణీయుడైన “లూయీ బ్రెయిల్” 1809 వ సంవత్సరం జనవరి, 04 వ తేదీన, ప్యారిస్ నగరానికి 20 మైళ్ళ దూరాన గల “క్రూవే” అనే గ్రామంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు మోనిక్ బ్రెయిలీ, సైమన్ రెనె బ్రెయిలీ. వారి కుటుంబ వృత్తి గుర్రపు జీన్లు తయారు చేయడం, లూయీ చిన్న తనం నుండే చాలా చురుకైనవాడు. తండ్రి గుర్రపు జీన్లు తయారు చేసే వస్తువులతో తానూ ప్రయోగాలు చేయ బోయి, దాదాపు 3, 4 సంవత్సరాల ప్రాయంలోనే ఒక కన్ను పోగొట్టు కున్నాడు. దానిని డాక్టర్లు కూడా నయం చేయలేక పోయారు. కొన్ని నెలల తర్వాత జబ్బుతో అతని రెండవ కన్ను కూడా పోయింది. అంధుడైన లూయీ తన అక్క, చెల్లెళ్ళతో తమ గ్రామంలో ఉన్న మామూలు బడికి వెళ్తుండేవాడు. పాఠాలను కేవలం వినడం ద్వారానే జ్ఞాపకం పెట్టుకునేవాడు. అలా తన సూక్ష్మ గ్రహణ శక్తితో ఉపాధ్యాయులను ఆశ్చర్య పరిచేవాడు. కుమారుని కష్టాలను తొలగించ డానికి లూయీ తండ్రి చాలా కష్టపడి, చిన్నచిన్న మేకులను చెక్కమీద అక్షరాల ఆకారంలో దిగ్గొట్టే వాడు. ఆమేకులను లూయి చేతులతో తాకుతూ అక్షరాలు, అంకెలనూ నేర్చుకున్నాడు.

“వాలెంటీస్ హవే” అనునతడు 1784 లో ప్రపంచంలోనే అంధులకు ప్రత్యేక పాఠశాలను ‘ప్యారిస్’ లో స్థాపించాడు. ఆయన దళసరి కాగితంపైన అక్షరాల ఆకారాన్ని ఉబ్బెత్తుగా వచ్చేటట్లు తయారు చేసేవాడు. దీనిని “లైన్ టైప్” అనేవారు.లూయీ 1819 లో ఆపాఠశాలలో చేరి “లైన్ టైప్” పద్ధతినే నేర్చుకొని ఎంతో తెలివిగల విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు.

తన పదిహేడవ ఏట అదే పాఠశాలలో ఉపాధ్యాయునిగా నియమించబడ్డాడు. పగలంతా విద్యాబోధన చేస్తున్నా, అంధులు మరింత సులభంగా వ్రాయగల, చదువగల లిపిని కనిపెట్టడానికి రాత్రులలో చాలాసేపు కష్టపడేవాడు. ఇలా ఉండగా 1821 లో “ఛార్లెస్ బార్బియర్” అనే రిటైర్డు సైనికాధికారిని కలుసుకోవడం జరిగింది. అతడు రాత్రులందు కూడా తన సైనికులు సమాచారమును తెలుసుకునేందుకు ఉపయోగపడే 12 గుండ్రని ఉబ్బెత్తు చుక్కలను కాగితంపై వ్రాసేవాడు. దీనిని గూర్చి తెలుసుకున్న తరువాత ‘లూయీ’ తన పరిశోధనకు తుదిరూపం ఇచ్చాడు. 12 గుండ్రని ఉబ్బెత్తు చుక్కల బదులు వాటిని కేవలం ఆరు చుక్కలకు కుదించాడు.

1832 లో ఈ ‘6’చుక్కలతో కొత్తలిపిని రూపొందించాడు. ఈ లిపి ద్వారా ప్రతి అక్షరము, ఉచ్ఛారణకు సంబంధించిన గుర్తులు, లెక్కలకు సంబంధించిన సాంకేతిక పదాలను, సంగీతానికి చెందిన గుర్తులను (చిహ్నాలు) తేలికగా రాయొచ్చు. 1851 లూయీ క్షయ వ్యాధికి గురయ్యాడు.

చివరకు 1852 జనవరి 6 వ తేదీన మరణించాడు. జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకోవాలని యునైటెడ్‌ నేషనల్‌ జనరల్ అసెంబ్లీ నవంబర్ 2018లో ప్రకటించింది. మొదటి ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జనవరి4, 2019న జరుపుకున్నారు.లూయిస్ బ్రెయిలీ అంధులకోసం చేసిన కృషిని కీర్తిస్తూ భారత ప్రభుత్వం ఆయన గౌరవార్ధం 2009లో ఆయన చిత్రంతో కూడిన రెండు రూపాయల నాణ్యాన్ని విడుదలచేసింది.