
అయోధ్యలోని రామజన్మభూమి మందిర ప్రాణప్రతిష్ఠ వారం రోజుల పాటు జరుగుతుంది. ఆ కార్యక్రమాలు జనవరి 16 నుంచి మొదలవుతాయని ఆలయ వర్గాలు వెల్లడించాయి.
జనవరి 16న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నియమించిన ఆతిథేయి, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆరోజు సరయూనది ఒడ్డున దశవిధ స్నానాలు, విష్ణుమూర్తి పూజ, గోదానం జరుగుతాయి. జనవరి 17న రామ్లల్లా-బాలరాముడి మూర్తితో ఊరేగింపు అయోధ్య చేరుకుంటుంది. భక్తులు మంగళ కలశాల్లో సరయూ జలాలను సేకరించి రామజన్మభూమి మందిరానికి వెడతారు.
జనవరి 18న సంప్రదాయిక కార్యక్రమాలు మొదలవుతాయి.గణపతి పూజ, అంబికా పూజ, వరుణ పూజ, మాతృకా పూజ, బ్రాహ్మణ వరణము, వాస్తు పూజ జరుగుతాయి. జనవరి 19న అగ్ని ప్రజ్వలన కార్యక్రమం చేపడతారు. నవగ్రహాలను ఏర్పాటు చేస్తారు. హోమం నిర్వహిస్తారు. జనవరి 20న రామజన్మభూమి మందిర గర్భగృహాన్ని సరయూ జలాలతో ప్రక్షాళన చేస్తారు. తర్వాత వాస్తుశాంతి, అన్నాధివాస కార్యక్రమాలు జరుగుతాయి.
జనవరి 21న బాలరాముడు-రామ్ లల్లా విగ్రహానికి 125 కుండాలలో స్నానం చేయిస్తారు. జనవరి 22న ఉదయ పూజ తర్వాత మధ్యాహ్నం మృగశిరా నక్షత్రంలో అభిజిన్ముహూర్తంలో బాలరామచంద్రమూర్తికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది.





