
హర్యానాకు చెందిన కరన్ కటారియా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో మాస్టర్స్ చదువుతున్నాడు. హిందూ దేశానికి చెందినవాడనే కారణంతో తాను చదువుతోన్న యూనివర్సిటీలో జనరల్ సెక్రటరీ పదవికి పోటీచేసేందుకు స్టూడెంట్ యూనియన్ అనర్హత వేటు వేసింది. తాను మాత్రమే కాకుండా లండన్ యూనివర్సిటీ క్యాంపస్లో భారతీయ విద్యార్ధులు ఎదుర్కొంటున్న జాతి వివక్ష, హిందూ ఫోబియా వేధింపులను తెల్పుతూ, ఈ విషయంపై మౌనం ఉండబోయేదిలేదని పేర్కొంటూ హర్యాణా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్ఎల్ ఖట్టర్కి లేఖ రాయడంతో ఈ విషయం వెలుగు చూసింది. కటారియాపై అనర్హత వేటు వేయడం, వివక్షపై అతని తల్లి తాజాగా హర్యాణా ముఖ్యమంత్రిని కలిశారు. దీనిపై స్పందించిన సీఎం ఖట్టారియా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వైస్ ఛాన్సలర్కు లేఖ రాశారు.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ పదవికి జరిగిన ఎన్నికల్లో మిస్టర్ కటారియాపై అనర్హత వేటు వేసినట్లు నాకు సమాచారం అందింది. ఈ అనర్హతకు మత, విశ్వాసాల పేరుతో వివక్ష చూపుతున్నట్లు గుర్తించాను. విద్యార్ధి తల్లి, సోదరి నన్ను కలవడానికి వచ్చినప్పుడు వారు తీవ్ర మానసిక క్షోభకు లోనైనట్లు గ్రహించాను. విద్యార్ధి భద్రత, శ్రేయస్సుపై చర్యలు తీసుకోవాలి. అలాగే అతని జాతి, విశ్వాల కారణంగా ఎదుర్కొంటున్న వివక్ష నుంచి రక్షణ కల్పించాలని’ కోరుతూ ఖట్టర్ తన లేఖలో రాశాడు. దీనిపై లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వైస్ ఛాన్సలర్ ఎరిక్ న్యూమేయర్ బదులిస్తూ..’స్టూడెంట్స్ యూనియన్ అనేది విద్యార్ధుల కోసం విద్యార్ధులు ఏర్పాటు చేసుకున్న ఆర్గనైజేషన్. మా విద్యార్ధుల భద్రత, శ్రేయస్సును నిర్ధారించడానికి కట్టుబడి ఉంటాం. స్టూడెంట్ లీడర్ ఎలక్షన్లలో ఎన్నికల నియమాలను ఉల్లంఘించినట్లు యూనివర్సిటీ గుర్తించింది. దీనిపై బాహ్య సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని’ వివరణ ఇచ్చారు.





