
అమెరికా రాజధాని వాషింగ్టన్ లో భారత దౌత్య కార్యాలయంపై దాడి చేయాలన్న ఖలిస్థాన్ మద్దతుదారుల కుట్ర చివరి నిమిషంలో భగ్నమైంది. లండన్, శాన్ఫ్రాన్సిస్కోలో విధ్వంసం జరగడంతో.. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఇక్కడ ముందుగానే ఈ కుట్రను అడ్డుకుంది. శనివారం కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలోని భారత దౌత్యకార్యాలయం వద్దకు చేరారు. వీరు అమెరికాలోని భారత దౌత్యవేత్త తరన్జీత్ సింగ్ సంధూను తిడుతూ బెదిరింపుల నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో తరన్జీత్ కార్యాలయంలో లేరు. ఖలిస్థానీ మద్దతుదారుల్లో కొందరు దౌత్యకార్యాలయంపై దాడికి దిగాలని రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. భవనం అద్దాలు పగలగొట్టాలని పిలుపునిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్నవారంతా దాడికి సిద్ధమయ్యారు.
పరిస్థితులు చేజారుతాయని ముందే ఊహించిన సీక్రెట్ సర్వీస్ బృందాలు, స్థానిక పోలీసులు అక్కడకు చేరుకొన్నారు. అదనపు బృందాలను కూడా పిలిపించారు. దాదాపు మూడు వ్యాన్లలో ప్రత్యేక దళాలు భారత దౌత్యకార్యాలయానికి రక్షణగా నిలిచాయి. ఆ సమయంలో ఐదుగురు ఖలిస్థానీ సానుభూతిపరులు అక్కడే ఉన్న భారత పతాకాన్ని కిందకు దించబోగా.. భద్రతా సిబ్బంది అడ్డుకొన్నారు. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. చాలా మంది ఆందోళనకారులు దాడులు చేయడానికి సిద్ధమై అక్కడికి వచ్చినట్లు గుర్తించారు. వారి వద్ద పెద్దసంఖ్యలో కర్రలు ఉన్నట్లు.. వాటిని దౌత్యకార్యాలయం సమీపంలోని ఓ పార్క్లో భద్రపర్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి కర్రలనే శాన్ఫ్రాన్సిస్కోలోని దౌత్యకార్యాలయంపై దాడికి వినియోగించారు.





