News

అఫ్తాబ్‌‌ ఆషామాషీ వ్యక్తి కాదు.. అతనికీ అంతా తెలుసు!

250views

దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసు లో నిందితుడైన అఫ్తాబ్‌‌ అమిన్ పూనావాలా ఆషామాషీ వ్యక్తి కాదు. బాగా శిక్షణపొందిన చెఫ్. మాంసం ఎలా నిల్వ చేయాలో బాగా తెలిసిన వ్యక్తి. శ్రద్ధ హత్య కేసుపై మంగళవారంనాడు సాకేత్ కోర్టులో విచారణ సందర్భంగా ఈ వివరాలను ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలియజేశారు.

తాజ్ హోటల్‌లో అఫ్తాబ్‌ శిక్షణపొందిన చెఫ్ అని, మాంసం ఎలా నిల్వచేయాలో అతనికి బాగా తెలుసునని, శ్రద్ధావాకర్ హత్య తర్వాత కూడా డ్రై ఐస్, అగర్‌బత్తీలకు అతను ఆర్డర్ ఇచ్చాడని పోలీసులు కోర్టుకు వివరించారు. శ్రద్ధ హత్య తర్వాత కూడా కొత్త సంబంధాలు కొనసాగిస్తూ, తన గాళ్‌ఫ్రెండ్‌కు ఉంగరం ఇచ్చాడని తెలిపారు. శ్రద్ధావాకర్ హత్యా క్రమాన్ని ఢిల్లీ పోలీసుల తరఫున వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ ప్రసాద్ కోర్టుకు వివరించారు. అఫ్తాబ్ తన తరఫు లాయర్‌ ఎంఎస్ ఖాన్‌ను మార్చాలని కోరడంతో ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను అతని కొత్త లీగల్ ఎయిడ్ కౌన్సిల్‌ (LAC)కు అమిత్ ప్రసాద్ అందజేశారు. దీంతో ఈ కేసులో వాదనలు వినిపించేందుకు ఎల్ఏసీకి అడిషనల్ సెషన్స్ జడ్జి మనీష్ ఖురానా కక్కర్ కొంత సమయం కేటాయించారు. తదుపరి విచారణను మార్చి 20వ తేదీకి వాయిదా వేశారు.

కేసు పూర్వాపరాలు..
అఫ్తాబ్ పూనావాలా …. శ్రద్ధావాకర్‌ను 2022 మేలో అత్యంత కిరాతకంగా చంపాడు. మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి వాటిని ఫ్రిజ్‌లో ఉంచి, ఆ తర్వాత ఢిల్లీ శివార్లలోని వేర్వేరు చోట్ల విసిరేశాడు. 2022 నవంబర్ 12న అఫ్తాబ్‌ను ఢిల్లీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో అఫ్తాబ్‌కు వ్యతిరేకంగా 6,629 పేజీల ఛార్జిషీటును ఢిల్లీ పోలీసులు జనవరి 24న నమోదు చేశారు. ఐపీసీలోని 302, 201 తదితర సెక్షన్ల కింద ఛార్జిషీటు ఫైల్ చేశారు. కేసు విచారణలో అఫ్తాబ్‌ నేరాన్ని నిరూపించేందుకు నార్కో అనాలసిస్ టెస్ట్, పోలీగ్రాఫ్ టెస్ట్‌ చేయించారు. డీఎన్ఏ సాక్ష్యాలను సేకరించారు. 150 మందికి పైగా సాక్షులను విచారించి, వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. అఫ్తాబ్ వాయిస్ శాంపుల్స్‌ను కూడా సేకరించారు.