News

జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడంపై ఇస్రో సంచలన నివేదిక విడుదల!

267views

పవిత్ర పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్‌ తదితర ప్రాంతాలకు ప్రధాన రోడ్డు మార్గంగా ఉన్న జోషిమఠ్ విషయంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సంచలన నివేదిక విడుదల చేసింది. ఇస్రో, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సి) జోషిమఠ్ పట్టణ ఉపగ్రహ చిత్రాలను తాజాగా విడుదల చేసింది. జోషిమఠ్ పట్టణం మొత్తం మునిగిపోయే అవకాశం ఉందని భూమి క్షీణతపై ఇస్రో ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. జోషిమఠ్ పట్టణ శాటిలైట్ చిత్రాలు కార్టోశాట్-2ఎస్ ఉపగ్రహం నుంచి ఇస్రో తీసుకొని పరిశీలించింది. హైదరాబాద్‌కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ జోషిమఠ్ పట్టణంలో మునిగిపోనున్న ప్రాంతాల ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది.

తొలి ప్రమాదం అక్కడే..
ఈ శాటిలైట్ చిత్రాల్లో ఆర్మీ హెలిప్యాడ్, నరసింహ ఆలయంతో సహా మొత్తం పట్టణం సెన్సిటివ్ జోన్‌గా ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇస్రో విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రమాదకర ప్రాంతాలైన జోషిమఠ్ లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది. జోషిమఠ్ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాధాన్యమిచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. గత ఏడాది నవంబర్, డిసెంబరు నెలల్లో జోషిమఠ్ పట్టణ భూమి క్షీణించిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

అక్కడ భూమి కుంగిపోవడంతో జోషిమఠ్-ఔలీ రహదారి కూడా కూలిపోనుందని ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. జోషిమఠ్ పట్టణంలో భూమి కుంగిపోయిన తర్వాత ఇళ్లు, రోడ్లకు పగుళ్లు రావడంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నప్పటికీ.. ఇస్రో ప్రాథమిక నివేదికలో వెల్లడైన విషయాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి.