News

మా ప్రభుత్వం నిండా అవినీతే – బీహార్ మంత్రి సుధాకర్ యాదవ్

432views

* నేను దొంగలకి సర్దార్ ని – నా పైన కూడా సర్దార్లున్నారు

* బీహార్ మంత్రి వ్యాఖ్యలతో ఇరకాటంలో నితీష్ సర్కార్

బిహార్ మంత్రి, ఆర్జేడీ నేత సుధాకర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తన శాఖలో ఎంతోమంది దొంగలున్నారని, వారికి తానే సర్దార్‌ అంటూ ఆయన మాట్లాడిన తీరు ఆ రాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. అక్కడితో ఆగకుండా తనపైన కూడా సర్దార్లు ఉన్నారంటూ జేడీయూ, ఆర్జేడీ అగ్రనేతలను వివాదంలోకి లాగారు.

‘నా వ్యవసాయ శాఖలో చోరీకి పాల్పడని విభాగం ఒక్కటీ లేదు. ఆ శాఖ నా నేతృత్వంలో నడుస్తోంది. కాబట్టి వారందరికీ నేను సర్దార్‌ను. నాపైనా ఎంతోమంది సర్దార్లున్నారు. ప్రభుత్వం మారింది. పనిచేసే తీరు మాత్రం అదే. అంతా గతంలో వలే ఉంది’ అంటూ నీతీశ్‌ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శనాత్మకంగా స్పందించారు. బిహార్‌ విత్తన సంఘంలో జరుగుతోన్న అవినీతిని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులను ఆదుకుంటామని చెప్తూ.. ఆ సంఘం రూ.200 కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. 2013లో నీతీశ్‌ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయనపై బియ్యం కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలుండటం గమనార్హం.

బిహార్‌లో నీతీశ్‌ కుమార్ జేడీయూ పార్టీ ఇటీవలే భాజపాతో బంధం తెంచుకొని.. ఆర్జేడీతో జట్టుకట్టింది. ప్రస్తుతం జేడీయూ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.