
భాగ్యనగరం: తెలంగాణలో సెప్టెంబర్ 17పై రాజకీయం నడుస్తోంది. మొదట బీజేపీ సెప్టెంబర్ 17న విమోచన దినం జరుపుతామని తెలిపింది. ఇందులో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం, అధికార టీఆర్ఎస్ సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినం జరపాలని సూచించాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. టీఆర్ఎస్, ఎంఐఎంపై ఫైరయ్యారు.
బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న విమోచన దినం ఇన్ని రోజులు ఎందుకు జరుపలేదు. మేము ఎన్నో ఏళ్ళుగా విమోచన దినోత్సవం కోసం పోరాడుతున్నాము. కేంద్రం అధికారికంగా విమోచన దినం జరుపుతామన్నాకే అన్ని పార్టీలు స్పందిస్తున్నాయి. ఉద్యమ సమయంలో విమోచన దినం జరపాలని కేసీఆర్ ఎందుకు అన్నారు. ఇప్పుడెందుకు సమైక్యత రాగం ఎత్తుకున్నారు.
ఒవైసీ కుటుంబం నుంచి వచ్చిన ఆదేశాలనే కేసీఆర్ పాటిస్తున్నారు. దారుస్సలాం ఆదేశాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ విమోచన దినోత్సవం జరిపాల్సిందే. అసద్దుదీన్ ఒవైసీ చేతిలో టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు కీలుబొమ్మలు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలేదు. కేంద్రం అధికారికంగా విమోచన దినోత్సవం జరుపుతామన్నాకే ఇప్పుడు పార్టీలు స్పందిస్తున్నాయి అని కౌంటర్ ఇచ్చారు.





