
మాయాపుర్: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం భారత్లో రూపుదిద్దుకోనుంది. బెంగాల్లోని మాయాపుర్ వాసుల దశాబ్దాల కల నెరవేరనుంది. మాయాపుర్లో ఇస్కాన్ సంస్థ నిర్మిస్తున్న వేదిక్ ప్లానెటేరియం 2024 నాటికి పూర్తికానుంది. ఇది పూర్తయితే వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కట్టడంగా నిలవనుంది.

ఈ వేదిక్ ప్లానెటేరియం నిర్మాణానికి 1976లోనే అడుగులు పడ్డాయి. ఇస్కాన్ సంస్థ వ్యవస్థాపకుడు ప్రభుపాద ఈ మేరకు ప్రయత్నాలు చేశారు. మాయాపుర్లో ఉన్న ఇస్కాన్ మందిరానికి అనుబంధంగా వైదిక జ్ఞాన, విజ్ఞాన కేంద్రం ఉండాలని ఆయన భావించారు. వేదాల జ్ఞానాన్ని ప్రజలకు పంచడం సహా ప్రపంచం ఎలా ఏర్పడిందనే విషయాలను ఈ ప్లానెటేరియం ద్వారా తెలియజేయాలని అనుకున్నారు. అయితే, దశాబ్దాలు గడిచిన తర్వాతే ఈ నిర్మాణ పనులకు మోక్షం లభించింది.
అమెరికా క్యాపిటల్ భవనాన్ని తలపించే ఈ నిర్మాణం 2010 ఫిబ్రవరి 14న ప్రారంభమైంది. ప్రతిష్ఠాత్మకంగా సాగుతున్న నిర్మాణ పనులు పలు కారణాల వల్ల 2016లో నిలిచిపోయాయి. అనంతరం, కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైంది. ఫలితంగా మందిర నిర్మాణం మరింత ఆలస్యమైంది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మందిర నిర్మాణాన్ని పూర్తి చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 2024 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మాయాపుర్లో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మించాలన్నది శ్రీ ప్రభుపాద కల. ఆయన కల నెరవేరబోతోంది. భక్తుల సాయంతో మందిర నిర్మాణం 2024 నాటికి పూర్తి కానుంది. శాంతిని అన్వేషించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులంతా ఇక్కడికి వస్తార అని మాయాపుర్ ఇస్కాన్ మందిరం ప్రతినిధి రసిక్ గౌరంగ్ దాస్ అన్నారు.
Source: EtvBharat





