
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతూనే ఉందని, బ్రిక్స్ దేశాల మధ్య సహకారం ఆ వ్యవస్థ పునరుజ్జీవానికి ఇతోధికంగా దోహదపడగలదని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆధ్వర్యాన గురువారం వీడియో ద్వారా జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా కూడా పాల్గొన్నారు.
మన దేశాల మధ్య నెలకొన్న పరస్పర సహకారం ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతోంది. వ్యాక్సిన్ పరిశోధన-అభివృద్ధి, ఔషధ ఉత్పత్తులను పరస్పరం గుర్తించుకోవడం వంటి చర్యలే ఇందుకు ఉదాహరణ. బ్రిక్స్ కేవలం చర్చలకే పరిమితం కాకుండా, ఇలాంటి చర్యల ద్వారా ప్రత్యేక అంతర్జాతీయ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. తాజా చర్చలో వచ్చిన సూచనలతో బ్రిక్స్ మరింత బలోపేతమవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. గ్లోబల్ ఎకానమీ నిర్వహణ విషయంలో కూటమి దేశాల విధానాల మధ్య సారూపత్య ఉండటం విశేషం. మన ‘న్యూ డెవలప్మెంట్ బ్యాంకు’ సభ్యత్వాలు పెరగడం మరో శుభపరిణామం అని మోడీ పేర్కొన్నారు.





