
తిరుపతి: తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం అమలుపై దుకాణదారులతో టీటీడీ అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి గురువారం సమావేశం నిర్వహించారు. శ్రీవారి సేవా సదన్ – 2లో జరిగిన ఈ సమావేశంలో దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు. తిరుమలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు తాము కూడా సహరిస్తామని తెలిపారు.
అనంతరం అదనపు ఈఓ మీడియాతో ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు తిరుమల దుకాణదారులు సహకరించడం అభినందనీయమన్నారు. ఈరోజు ఐదో సమావేశం నిర్వహించామన్నారు.
తయారీదారుల నుండి ప్లాస్టిక్ కవర్లలో వచ్చే కొన్ని ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు తమ సమస్యలను చెప్పుకున్నారని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని అదనపు ఈఓ తెలిపారు. అనంతరం తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్వీ హైస్కూల్లో పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు తీసుకొచ్చిన అభివృద్ధిని వివరించారు.





