
-
77,700 మందితో భారీ భారత జాతీయ పతాక ప్రదర్శన
-
ఆజాదీగా అమృతోత్సవ్ లో భాగంగా బీహార్లో ఏర్పాటు
జగ్దీష్పుర్: జాతీయ పతాకానికి సంబంధించి భారత్ సరికొత్త రికార్డుకు యత్నించింది. సుమారు 77,700 మంది ప్రజలు భారత జాతీయ పతాకాలను ఏకకాలంలో గాల్లో అటూఇటూ ఊపుతూ 18 ఏళ్ళ క్రితం పాకిస్థాన్ నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టారు. .
బీహార్లోని జగ్దీష్పుర్లో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా 1857 తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించిన వారిలో ఒకరైన అప్పటి జగ్దీష్పుర్ రాజు వీర్కున్వర్ సింగ్ 164 వర్ధంతి కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజలు జాతీయ పతకాలను చేతబూని ఏకకాలంలో అయిదు నిమిషాల పాటు అటూఇటూ ఊపుతూ రికార్డుకు యత్నించారు. అదే సమయంలో వందేమాతరం వాయిద్య ప్రదర్శన శ్రవణానందకరంగా వినిపించింది.
బీజేపీ బీహార్ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు ఆర్.కె.సింగ్, నిత్యానంద రాయ్, బీహార్ ఉప ముఖ్యమంత్రులు తార్కిశోర్ ప్రసాద్, రేణు దేవి, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ తదితరులు హాజరయ్యారు.
గిన్నిస్ సంస్థ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని లెక్కించడానికి ప్రత్యేక కెమెరాలు ఏర్పాటుచేయడమే కాకుండా చేతులకు బ్యాండ్లు అమర్చారు. వేదిక వద్ద ఏర్పాటుచేసిన భారీ తెరపై కార్యక్రమంలో పాల్గొన్న వారి సంఖ్య 77,700 అని ప్రత్యక్షం అవగానే హాజరైన వారందరిలో ఉత్సాహం మిన్నంటింది. 2004లో పాకిస్థాన్లోని లాహోర్లో నిర్వహించిన కార్యక్రమంలో 56,000 మంది పాకిస్థానీలు తమ దేశ జాతీయ పతాకాన్ని ఏకకాలంలో గాల్లో అటూఇటూ ఊపుతూ రికార్డు నెలకొల్పారు.





