
మంగళూరు: కర్ణాటక మంగళూరు సమీపంలో భిక్షాటన చేస్తున్న ఓ మహిళ సెలిబ్రటీగా మారిపోయింది. కునాడాపూర్ గంగోల్లిలో నివసించే అశ్వత్తమ్మ(80) ఆలయాల వద్ద యాచించి సంపాదించిన సొమ్మును తిరిగి దేవస్థానానికే విరాళం ఇచ్చింది.
పొలాలి గ్రామంలోని రాజరాజేశ్వరి ఆలయంలోని అన్నదాన సేవ కోసం రూ.లక్ష విరాళంగా ఇచ్చింది. అశ్వత్తమ్మ పొలాలిలోని ఆలయం బయటే భిక్షాటన చేస్తూ జీవిస్తుంది.
అయ్యప్ప స్వామి భక్తురాలైన అశ్వత్తమ్మ.. నిరంతరం మాల ధరించి పూజ చేస్తూ ఉంటుంది. గతేడాది కూడా అశ్వత్తమ్మ ఉడుపిలోని వివిధ దేవాలయాలకు రూ.5 లక్షల విరాళాలను అందించింది.
ఈ మొత్తాన్ని అన్నదాన పథకానికి వినియోగించాలని ఆమె కోరింది. శబరిమల అయ్యప్ప ఆలయానికి లక్ష రూ.లు, తన్నూరు కంచుగోడు ఆలయానికి రూ.1.5 లక్షలు, సాలిగ్రామ ఆలయానికి లక్ష రూ.లు అందించింది. ఇలా పేదరికంలో ఉండి భిక్షాటన చేస్తున్నా.. తాను సంపాదించిన సొమ్మును దానం చేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది అశ్వత్తమ్మ.





