ArticlesNews

మన మధ్యలోనే ఉండి మహోన్నతిని సాధించిన ముమ్మడివరం బాలయోగి

1.2kviews

గోదావరి నది లోయల మధ్య సస్యశ్యామలమైన, సారవంతమైన భూమి, ఎటు చూసినా కొబ్బరి చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం, సుందరమైన ప్రకృతితో పాటు కవులను, పండితులను, దాతలను అందించిన నేల తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమది.

ఈ పుణ్య ప్రదేశంలో అమలాపురానికి 15 km ల దూరంలో ముమ్మడివరం గ్రామం ఉంది. ఆ గ్రామంలోని హరిజనవాడలో శ్రీమతి రామమ్మ, గంగయ్య దంపతులకు ప్రమోదూత నామ సంవత్సరం కార్తీక శుద్ధ తదియ గురువారం స్వాతి నక్షత్రం నందు (1930 అక్టోబరు 23) పుత్రుడు జన్మించాడు. ఆ పిల్లవానికి సుబ్బారావు అని నామకరణం చేశారు. 10 సంవత్సరాల వయస్సు రాగానే బాపన్న అనే రైతు వద్ద గోవుల కాపరిగా చేర్చారు. గోవులను జాగ్రత్తగా చూసుకుంటూ యజమానులు చెప్పిన పనులన్నీ చేస్తుండేవాడు సుబ్బారావు. ముమ్మడివరం గ్రామంలో ఒక ఆచారం ఉండేది. శ్రీ లంక తల్లెమ్మ వారి తీర్ధ సమయంలో పాలేరులను మార్చే ఆచారం ఉండేది. సుబ్బారావు ఆ తీర్ధ సమయానికి ముందు తన యజమానులను మీరు ఇంకొక కొత్త పాలేరును చూసుకోండి. నేను ఇక ఈ పనిలో ఉండను అని చెప్పాడు. అప్పటికే వారి దగ్గర 3 సంవత్సరాలుగా పని చేస్తూ ఉన్నాడు. తనకు ఇష్టం లేకపోయినా కూడా తల్లిదండ్రులు వెంకన్న గారి దగ్గర పాలేరుగా చేర్చారు. 21/06/1946 ప్రాతః సమయంలో తల్లిదండ్రులు అపురూపమైన దృశ్యం చూశారు. ఒక కొబ్బరి చెట్టు కింద శ్రీ కృష్ణ భగవానుడు నారద మహర్షి గల చిన్న చిత్ర పటము ముందు ఉంచుకుని పద్మాసన స్ధితిలో తపస్సు ప్రారంభించాడు సుబ్బారావు.

ధ్యాన సమాధిలో కనులు మూసుకుని నిశ్చలంగా కూర్చున్న ఆ సుబ్బారావుని దర్శించుకోవడానికి గ్రామం నుండి ప్రజలు విచ్చేశారు. ఆ సుబ్బారావే ముమ్మడివరం బాల యోగీశ్వరుడిగా వినుతికెక్కాడు. అన్న పానాదులను త్యజించి తపోనిష్ఠలో ఉండేవారు.

తండోపతండాలుగా ప్రజలు రావడం మొదలైంది. ఎండా వానలను లెక్క చెయ్యకుండా తపస్సులో ఉన్న బాల యోగీశ్వరునికి తలుపులు గుమ్మాలు లేనటువంటి ఒక మందిరాన్ని నిర్మించారు. ప్రజలు స్వేచ్చగా దర్శించుకునే వీలు ఏర్పాటు చేశారు. అయితే అందరూ ఒకేలా ఉండరు కదా. ఆయనను ముట్టుకుంటూ, గిల్లుతూ ఆయనను అటు ఇటు కదిపే ప్రయత్నం చేసేవారు. అయినప్పటికీ వారు నిశ్చల ధ్యాన స్ధితిలో ఉండేవారు.

వ్యాసం సత్తిరాజు గారు కాకినాడ వాస్తవ్యులు. 06/02/1949 న యోగీశ్వరుల దర్శనానికి విచ్చేశారు. అప్పటికే బాల యోగీశ్వరులు తపస్సులో కూర్చుని 2 సంవత్సరాల 3 నెలలు అయింది. అప్పటివరకూ ఎవరితోనూ వారు మాట్లాడలేదు. ఆ రోజు సత్తిరాజు గారితో కనులు తెరిచి “ కొంత మంది వలన నా తపస్సుకు అంతరాయం కలుగుతోంది. ఏకాంత స్ధితి భగ్నం అవుతోంది. ఈ మందిరానికి తలుపులు, కిటికీలు పెట్టించి తాళం వేయమని కోరారు.” ప్రతిరోజూ కొద్దిగా పాలు, నీరు భక్తిగా లోపల ఉంచమని కోరారు. ఇది కేవలం దైవ ఆరాధనకు మాత్రమే అని తెలిపారు. యోగ బలంచే మల, జల విసర్జనను అరికట్టేవారు. భక్తుల కోరిక మేరకు ప్రతి సంవత్సరం శివరాత్రి తర్వాతి రోజున ప్రజలకు దర్శనం ఇచ్చేవారు. వారి దర్శనం కోసం సుమారు 5-6 లక్షల మంది భక్తులు 2 రోజుల ముందు నుండి ఎదురు చూసేవారు. శ్రీమతి పమిలా స్కార్ట్ ప్రసిద్ధ french బేలే నృత్య కళాకారిణి ప్రతి సంవత్సరం వచ్చి బాల యోగీశ్వరుని దర్శనం చేసుకుని వెళ్ళేవారు. French భాషలో బాల యోగీశ్వరులపై గ్రంథాన్ని కూడా రచించారు. ఈ విధముగా ప్రపంచమంతటా బాల యోగీశ్వరులు ప్రసిద్ధి పొందారు. “తపస్సు చేసుకునేందుకు హిమాలయాలలోనూ, అడవులలోనూ అవసరం లేదు. ప్రజా సమూహం మధ్యలో కుడా తపస్సు చేయవచ్చు.” అనే సందేశాన్ని ఇచ్చారు శ్రీ బాల యోగీశ్వరులు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.