
అమృత్సర్: జిత్తులమారి పాకిస్తాన్కు ఎన్ని దెబ్బలు తగులుతున్నా… ఎన్ని అవమానభారాలు మోస్తున్నా గుణపాఠం రావడం లేదు. భారత్పై ఎప్పటికప్పుడు దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఓ డ్రోన్ను భారత్వైపు పంపింది. దీనిని పసిగట్టిన బీఎస్ఎఫ్ సత్వరం పాకిస్థాన్ దుష్ట బుద్ధిని అణిచివేసింది. ఆ డ్రోన్ను చూసి జవాన్లు కాల్పులు ప్రారంభించారు.
పంజాబ్ అమృత్ సర్ జిల్లా రామ్దాస్ పీఎస్ పరిధిలోని పంజ్ గ్రాహియా సమీపంలో, ఆ డ్రోన్ పేలుడు పదార్థాలను విసిరి పాకిస్తాన్కు బయలుదేరింది. భారత భూభాగంలో ఆ డ్రోన్ జారవిడిచిన రెండు పేలుడు పదార్థాలను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సంభవించింది.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో బీఎస్ఎఫ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న ఆ పేలుడు పదార్థాల తీవ్రత..అవి ఎంత ప్రమాదవకరమైనవో గుర్తించేందుకు పరిశోధనలు చేస్తున్నారు. గతేడాది జమ్మూలో పలుమార్లు డ్రోన్లతో దాడులకు యత్నించింది పాకిస్తాన్. తాజాగా మరోసారి డ్రోన్ దాడికి విఫలయత్నం చేసింది.
Source: Tv9





