
-
డబ్ల్యూహెచ్వో శాస్త్రవేత్త వెల్లడి
జెనీవా: భారత్ ప్రపంచ ఫార్మసీ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చెప్పారు. పోలియో నిర్మూలన, ప్రసూతి, శిశు మరణాల రేటు తగ్గుదల, యూనివర్సల్ హెల్త్ కవరేజ్, ప్రపంచ ఫార్మసీగా ఎదగడం అద్భుత విజయాలని చెప్పారు. కొవిడ్ వల్ల భారత్ సహా ప్రతి దేశంలోనూ అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలు ప్రభావితమయ్యాయని చెప్పారు. వ్యవస్థలో వీటిని తట్టుకోగలిగే సామర్థ్యాన్ని పెంచాలన్నారు.
భవిష్యత్లో ఆరోగ్య సంక్షోభాలు ఏర్పడితే ఇతర అత్యవసర ఆరోగ్య సేవలను అందజేయడంలో రాజీ పడకుండా ఎదుర్కొనగలిగే సమర్థతను పెంచాలని చెప్పారు. పేదరికాన్ని కొవిడ్ మహమ్మారి పెంచిందన్నారు. దీనివల్ల ప్రజలకు తగిన పోషకాహారం అందని పరిస్థితి తీవ్రమవుతుందని చెప్పారు. సరైన పోషకాహారం అందకపోతే క్షయ వంటి వ్యాధులు సంక్రమిస్తాయని చెప్పారు. ఈ పరిస్థితులను నిశితంగా గమనించాలని, ముందస్తు నిరోధక చర్యలు చేపట్టాలని కోరారు.





