News

ఆఫ్గాన్‌ ఘర్షణల్లో భారత ఫొటో జర్నలిస్టు మృతి

376views

ఫ్గనిస్థాన్‌లో ఆ దేశ బలగాలు, తాలిబన్లకు మధ్య జరిగిన ఘర్షణలో భారత్‌కు చెందిన ఫొటో జర్నలిస్టు, పులిట్జర్‌ అవార్డు గ్రహీత డానిశ్‌ సిద్ధిఖీ ప్రాణాలు కోల్పోయారు. కాందహార్‌లోని స్పిన్‌ బొల్డాక్‌ ప్రాంతంలో గల కీలక పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాన్ని తాలిబన్లు ఇటీవల తమ అధీనంలోకి తీసుకున్నారు. దీంతో గత కొద్ది రోజులుగా తాలిబన్‌, అఫ్గాన్‌ బలగాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. రాయిటర్స్‌ సంస్థలో పనిచేస్తున్న డానిశ్‌.. ఈ ఘటనలను కవర్‌ చేస్తున్నారు. అయితే గురువారం రాత్రి జరిగిన ఘర్షణల్లో ఆయన మృతిచెందారు.

డానిశ్‌ మృతిని భారత్‌కు అఫ్గాన్‌ రాయబారి ఫారిద్‌ మముంజే ట్విటర్‌ వేదికగా ధ్రువీకరించి సంతాపం ప్రకటించారు. ”డానిశ్ సిద్ధిఖీ మరణం బాధాకరం. రెండు వారాల క్రితమే ఆయనను కలిశా. అఫ్గాన్‌ బలగాలతో కలిసి ఆయన ఘర్షణ జరిగిన ప్రాంతానికి వెళ్లారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా” అని ఫారిద్‌ ట్వీట్ చేశారు.

ముంబయికి చెందిన డానిశ్.. మాస్‌ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. తొలుత టీవీ న్యూస్‌ కరస్పాండెంట్‌గా పనిచేసిన ఆయన.. 2010లో ఫొటో జర్నలిస్టుగా రాయిటర్స్‌లో చేరారు. 2018లో రోహింగ్యా శరణార్థులపై చేసిన ఫీచర్‌ ఫొటోగ్రఫీకి గానూ ప్రతిష్టాత్మక పులిట్జర్‌ అవార్డు అందుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.