News

విద్వేషపూరిత ప్రసంగం చేసిన కేసులో, నిందితుడికి బెయిల్ నిరాకరించిన కోర్టు – CAA వ్యతిరేక నిరసనకారులపై కాల్పులు జరిపిన వ్యక్తే ఈ కేసులోనూ నిందితుడు

659views

త సంవత్సరం జనవరిలో ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీలో పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా నిరసన చేపట్టిన వారిపై కాల్పులు జరిపిన రాం భక్త గోపాల్ అనే 19 సంవత్సరాల యువకుడికి విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన కేసులో బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. హర్యానాకు చెందిన బిజెపి అధికార ప్రతినిధి మరియు కర్ణిసేన అధ్యక్షుడు అయిన సూరజ్ పాల్ అము పాల్గొన్న ఒక సభలో ఈ యువకుడు ఒక మత వర్గానికి చెందిన యువతులను అపహరించి హత్య చేయవలసిందిగా సభికులకు పిలుపునివ్వడం వివాదాస్పదమైంది.

రాం భక్త గోపాల్ తన 17 సంవత్సరాల వయసులో ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొంతమంది నిరసనకారులు చేపట్టిన నిరసన ప్రదర్శనపై కాల్పులు జరిపింది కూడా ఈ యువకుడే కావడం గమనార్హం.

ఈ సంఘటన యొక్క వీడియో రికార్డింగ్ ను చూసి దిగ్భ్రాంతికి గురైనామని గుర్గావ్ కోర్టు పేర్కొంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భారతీయ సమాజం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నదని కోర్టు అభిప్రాయపడింది. అవకాశం ఇస్తే…. ఇలాంటి వ్యక్తులు తమ స్వంత అభిప్రాయాలు, మత విద్వేషాల ఆధారంగా అమాయకులను మూకుమ్మడిగా హత్య చేయడానికి కూడా వెనుకాడరని కోర్టు వ్యాఖ్యానించింది.

“కోర్టు ముందు నిలబడిన నిందితుడు ఏమీ తెలియని సాధారణ, అమాయక యువకుడు కాదు. అతను గతంలో చేసిన పనులు, ఇప్పుడు నిర్భీతిగా తన ద్వేషాన్ని వ్యక్తం చేయడం చూస్తే… అతను జన సమూహాన్ని కూడా తన ద్వేషంలో పాలు పంచుకునేలా చేసే ప్రమాదమున్నదనిపిస్తోంది.” అని కోర్టు వ్యాఖ్యానించింది.

‘స్వేచ్ఛా ప్రసంగం’ మరియు ‘భావ ప్రకటనా స్వేచ్ఛ’ అంటే ప్రస్తుతం ఈ నిందితుడు చేసినట్లుగా వివాదాస్పదమైన, దారుణమైన, విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చెయ్యడం కాదని, అవి ఎంతమాత్రమూ ఆమోదయోగ్యమైనవి కావని కోర్టు అభిప్రాయపడింది.

“భారతదేశ పౌరులు, ఏ మత విశ్వాసానికి లేదా కులానికి చెందిన వారైనా అభద్రతా భావానికి లోను కాకుండా ఉండాలంటే ఇలాంటి ద్వేష భావం కలిగిన వారు స్వేచ్చగా సంచరించకుండా చూడాలి.” అని పేర్కొనడం ద్వారా కోర్టు పోలీసులకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి తన రాజ్యాంగ విధిని గుర్తు చేసింది.

“ఒక నిర్దిష్ట మతానికి చెందిన బాలికలను అపహరించి చంపాల్సిందిగా పిలుపునిస్తూ నిందితుడు చేసిన విద్వేషపూరిత ప్రసంగం కూడా ఒక రకంగా హింసతో సమానమేనని కోర్టు అభిప్రాయపడింది. అలాంటి వ్యక్తుల రెచ్చగొట్టే ప్రసంగాలు నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయి.” అని కూడా కోర్టు నొక్కి చెప్పింది.

నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఒక నిర్దిష్ట సమూహం లేదా మతంపై దాడులను ప్రేరేపించడం, ఒక సమూహం యొక్క మతపరమైన భావాలను రెచ్చగొట్టడం, ఉద్దేశపూర్వకంగా హానికరమైన చర్యలకు పాల్పడడం వంటి అభియోగాలను పోలీసులు అతనిపై నమోదు చేశారు.

ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక నిరసనకారులపై కాల్పులు జరిపినందుకు గత ఏడాది జనవరిలో అరెస్టయిన నిందితుడు ఇటీవలే బెయిల్ ‌పై బయటకు వచ్చాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.