
73 వ మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్రమోడీ కేరళ వెంబనాడ్ సరస్సు సంరక్షకుడు రాజప్పన్ ను అభినందించారు.
ప్రతి ఒక్కరికీ రాజప్పన్ ఒక రోల్ మోడల్ అని ప్రధాని కొనియాడారు . “కొట్టాయం కుమారకోం నివాసి అయిన రాజప్పన్ వెంబనాడ్ సరస్సులో విసిరేసిన సీసాలు సేకరించి అవి అమ్మి జీవిస్తుంటారు. పుట్టుకతోనే రెండు కాళ్లు పనిచెయ్యక పోయినప్పటికీ, రాజప్పన్ ఈ గొప్ప పని చేస్తున్నారు. అతని వల్లే వెంబనాడ్ సరస్సు చాలా పరిశుభ్రంగా ఉంది” అని ప్రధాని ప్రశంసించారు.
బాటిల్స్ అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం జీవించడానికి చాలా తక్కువ అయినప్పటికీ, రాజప్పన్ జీవితం సీసాలు అమ్మడం పైనే ఆధారపడి ఉంటుంది. ఉదయం 6 గంటలకు రాజప్పన్ పడవతో సరస్సు వద్దకు వెళ్తాడు. ఒక్కోరోజు తిరిగి రావడానికి రాత్రి కూడా అవుతుంది. అతను పెద్దగా ఆశపడడు. అతను సేకరించిన సీసాలకు న్యాయమైన ధర మాత్రమే కోరుకుంటాడు. రాజప్పన్ ఆరేళ్లుగా ఈ పని చేస్తున్నాడు. అతని ఇల్లు కూడా శిధిలావస్థలో ఉంది. ఇంటికి కరెంట్ సప్లై కూడా లేదు. కొవ్వొత్తి వెలిగించుకుని ఆ ఇంట్లో ఉంటూ ఈ పని చేస్తూ జీవిస్తుంటాడు. రాజప్పన్ తను చేస్తున్న పనిపట్ల సంతోషంగా ఉన్నానని అంటున్నాడు. ప్రధాని మన్ కీ బాత్ లో తన పేరుని, తను చేస్తున్న పనిని ప్రస్తావించడం పట్ల రాజప్పన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.





