
552views
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని జాతీయ వేద విశ్వవిద్యాలయంగా ప్రకటించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి డా. రమేష్ పోఖ్రియాల్ను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం దిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన సుబ్బారెడ్డి వినతిపత్రం అందజేశారు. 2006లో తితిదే ఆధ్వర్యంలో వేద విద్య వ్యాప్తి, పరిరక్షణ కోసం శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించామని తెలిపారు. 2007లో రాష్ట్ర విశ్వవిద్యాలయంగా యూజీసీ గుర్తించిందన్నారు. వేదాలకు సంబంధించి డిగ్రీ నుంచి పీహెచ్డీ వరకు వివిధ కోర్సులు నడుపుతున్నట్లు వివరించారు. అంతేకాకుండా వేద విద్యను ప్రోత్సహించేందుకు సొంతంగా వేద పాఠశాలలు నడపడమే కాకుండా దేశవ్యాప్తంగా 80 వేద గురుకులాలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నట్లు సుబ్బారెడ్డి లేఖలో పేర్కొన్నారు.





