
495views
పలు ఉగ్ర సంస్థలతో సంబంధాలున్న ఐదుగురు నిందితులను దేశరాజధాని ఢిల్లీలో పోలీసులు సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. వారు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారని, అనంతరం తూర్పు ఢిల్లీలోని శాకర్పూర్లో వారిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో ఇద్దరిది పంజాబ్ అని, ముగ్గురు కశ్మీర్ కి చెందినవారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(ప్రత్యేక విభాగం) ప్రమోద్ కుశ్వాహా మీడియాకు వెల్లడించారు. ‘పోలీసులు, నిందితుల మధ్య కాల్పుల అనంతరం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాం. వారి నుంచి ఆయుధాలు, ఇతర హానికారక పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నాం’ అని వెల్లడించారు. వారిలో కొందరికి ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నామని, అయితే దాన్ని ధ్రువీకరించాల్సి ఉందన్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయని తెలిపారు.





