
కీలక సమయంలో ప్రపంచ దేశాలకు అవసరమైన ఔషధాలను పంపుతున్న భారత్కు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. కొవిడ్-19 చికిత్సలో ఆశాజనక ఫలితాలు ఇస్తుందన్న మలేరియా నివారణ మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ను పంపినందుకు ఇప్పటికే అమెరికా, బ్రెజిల్ సహా మరికొన్ని దేశాలు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపాయి. తాజాగా ఈ జాబితాలో ఇజ్రాయెల్ కూడా చేరింది. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ”ఇజ్రాయెల్కు క్లోరోక్విన్ పంపినందుకు భారత ప్రధాని, నా ఆప్తమిత్రుడు మోడీకి ధన్యవాదాలు. ఇజ్రాయెల్ పౌరులంతా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి నేను మోడీతో తరచూ చర్చిస్తున్నాను. పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నాం” అని నెతన్యాహూ ట్వీట్ చేశారు.
హైడ్రాక్సీక్లోరోక్విన్ను ఉత్పత్తి చేసే పదార్థాలు సహా మరికొన్ని ప్రాణాధార ఔషధాలతో ఎయిరిండియా విమానం మంగళవారం ఇజ్రాయెల్కు చేరింది. దాదాపు ఐదు టన్నుల మందుల్ని అందించినట్లు అధికారిక సమాచారం. ఇజ్రాయెల్లో ఇప్పటి వరకు 10వేల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. వీరిలో 86 మంది మృత్యువాతపడగా 121 మంది ఐసీయూ ఉన్నారు.





